చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దుల హజరుశాతం రోజురోజుకి పెరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పిల్లలందరూ కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, అనసవరమైన భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను నిర్భయంగా పాఠశాలలకు పంపించవచ్చన్నారు.
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)కు చెందిన విద్యార్దులు తమకు అందుబాటులో ఉన్న పాఠశాలలకు వెళ్లి చదువుకోవచ్చని, వసతిగృహాలు ప్రారంభించిన వెంటనే తిరిగి కేజీబీవీలోకి వెళ్లవచ్చన్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు వంటషెడ్, ప్రహరిగోడకు, మూత్రశాలకు సైతం నిధులు మంజూరవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంఈఓ సత్యనారాయణ, హెచ్ఎం గంగాప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.