దమ్మపేట: భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న 1996 కేంద్ర చట్టం, 1979 వలస కార్మికుల చట్టానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవరణలు చేస్తూ బలహీన పరుస్తుందని దీంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం మండల కేంద్రంలో తొలుత దమ్మపేట సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాపీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు బెక్కం వెంకటేశ్వరరావు, సామేలు ఆధ్వర్యంలో యూనియన్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహించగా సీఐటీయూ డివిజన్ నాయకులు పిట్టల అర్జున్ సమ్మెలో పాల్గొని సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర చట్టం, వలస కార్మిక చట్టాలను పకడ్భంధీగా అమలుచేయాలని, కార్మిక సంఘాల భాగస్వామ్యంతో సంక్షేమబోర్డు సలహా మండలి ఏర్పాటు చేయాలని, మండల కేంద్రాల్లో అడ్డా స్థలాలు, షెడ్లు, మరుగుదొడ్లు నిర్మించాలని, ట్రాక్టర్ ఇసుక రూ.600లకే అందించాలని, సంక్షేమ బోర్డు లేదా బ్యాంకుల నుంచి నిర్మాణ రంగ యంత్రాలు, సామాగ్రి కొనుగోలుకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని, 55 ఏళ్లు పైబడిన కార్మికులకు నెలకు రూ.6వేలు పెన్షన్, పిల్లల చదువులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని, ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.10లక్షలు, సహజ మరణానికి రూ.5లక్షలు, వివాహ, ప్రసూతి సహాయం రూ.లక్షకు పెంచాలని, కార్పెంటర్లకు సబ్సిడీపై కలప అందించాలని, కార్మికశాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, లాక్డౌన్ సమయంలో గడువు ముగిసిన కార్డుల రెన్యువల్కు అనుమతించాలని, నిర్మాణరంగంలో వాడే ముడిసరుకులపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.