నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా లబ్ధి
తొలివిడతలో సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యం
కరోనా కష్టకాలంలోనూ పెట్టుబడి సాయం
సీఎం కేసీఆర్కు అన్నదాతల కృతజ్ఞతలు
నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా లబ్ధి
తొలివిడతలో సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యం
కరోనా కష్టకాలంలోనూ పెట్టుబడి సాయం
సీఎం కేసీఆర్కు అన్నదాతల కృతజ్ఞతలు
కొత్తగూడెం /ఖమ్మం వ్యవసాయం, జూన్ 14: రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్ రైతుబంధు పథకానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు రైతుల జాబితా సైతం సిద్ధం చేశారు. ఆర్థికశాఖ ట్రెజరీకి నిధులనూ విడుదల చేసింది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఈ సాయం అందిస్తున్నది. విత్తనం నాటే సమయం నుంచి మార్కెటింగ్ వరకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అన్నదాతకు అండగా నిలుస్తున్నది. అన్నంపెట్టే రైతు అప్పుల పాలు కాదొద్దనే సదుద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పెట్టుబడి సాయం అందిస్తున్నది. పట్టాదారు పాసుపుస్తకం కలిగిన ప్రతి రైతుకు తొలుత ఎకరానికి రూ 4 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ 8 వేలు అందించిన ప్రభుత్వం ఆ తర్వాత ఒక్కో ఎకరానికి రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఏటా పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఏడాదిలో ఎకరానికి రూ.10 వేల చొప్పున అందజేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 4 లక్షల మంది రైతులకు పైగా లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో అదునుకు తగ్గట్టుగా ప్రభుత్వం సాయం అందిస్తున్నది.
3.09 లక్షల మంది రైతులకు లబ్ధి
వానకాలంలో జిల్లా వ్యాప్తంగా 3. 09 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ ఏడాది పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన ప్రతి రైతుకు రైతుబంధు సొమ్ము జమ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నెల 10వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈసారి 4,500 నుంచి 5 వేల మందికి కొత్త రైతులకు సాయం అందనుంది. ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, కామేపల్లి మండలాల్లో 30,266 మంది, పాలేరు నియోజకవర్గంలో 69,713 మంది, మధిర నియోజకవర్గంలో 82,997 మంది, సత్తుపల్లి నియోజకవర్గంలో 78,853 మంది. వైరా నియోజకవర్గంలో 48,013 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. మొత్తంగా 3,09 847 మంది రైతులకు సర్కార్ నుంచి రూ.362 కోట్ల సొమ్ము అందనుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..
వానకాలంలో పంటలు సాగు చేస్తున్న రైతులకు రైతుబంధు ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ప్రభుత్వం నిధులనూ మంజూరు చేసింది. జిల్లాలో 1,39,707 మంది రైతులకు గాను రూ.213.11 కోట్లు విడుదల చేయనుంది. జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాలు కలిగిన రైతులు 1,17,067 మంది ఉండగా పోడు రైతులు 22,640 మంది ఉన్నారు. వీరందరికీ త్వరలో రైతుబంధు సాయం అందనుంది.
తొలివిడతగా రూ.10.52 కోట్లు..
ఈ నెల చివరిలోపు అందరి రైతులకు రైతుబంధు సాయం జమకానుంది. ఇప్పటికే తొలి విడత ఇవ్వనున్న 30,279 మంది రైతులకు గాను రూ.10.52 కోట్లు చెల్లింపులు ట్రెజరీకి వచ్చాయి. వాటిని నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అనుకున్న సమయానికి రైతుల ఖాతాల్లో వేస్తున్న తెలంగాణ సర్కార్కు రైతులు జై కొడుతున్నారు.
సాయాన్ని సద్వినియోగం చేసుకుంటాం..
కరోనా వంటి కష్టకాలంలో ప్రభుత్వం రైతు బంధు సాయం అందించడం హర్షణీయం. సీఎం కేసీఆర్ సార్కు రైతుల తరఫున కృతజ్ఞతులు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజలకు సాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందున్నది. కష్టకాలంలో రైతులకు ఈ సొమ్ము చాలా ఉపయోగపడుతుంది. సీజన్లో సకాలంలో రైతుబంధు అందుతున్నది.
బానోత్ బద్దు,కోమటిపల్లి రైతు
ఇబ్బందులనూ పరిష్కరిస్తాం..
విడతల వారీగా రైతుల ఖాతాల్లో రైతుబందు సొమ్ములు జమకానున్నాయి. తొలి విడతగా రూ.10.52 కోట్లు సొమ్ములు ట్రెజరీ ద్వారా రైతులకు అందనున్నాయి. ఈ నెల చివరి కల్లా అందరి రైతులకు రైతు బందు అందనుంది. పంట పెట్టుబడి సాయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానిక ఏఈఓలు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. –కొర్సా అభిమన్యుడు,
జిల్లా వ్యవసాయధికారి, కొత్తగూడెం
అర్హత కలిగిన ప్రతి రైతుకు వర్తింపు..
జిల్లా వ్యాప్తంగా పట్టాదారు పాసు పుస్తకం కలిగిన ప్రతి రైతుకు రైతుబంధు అందజేస్తాం. తొలుత సన్నా, చిన్నకారు రైతులకు ప్రాధాన్యం ఉంటుంది. మిగిలిన రైతులకు సైతం క్రమేణా సదరు రైతుల అకౌంట్లలో సొమ్ము జమ అవుతుంది. అర్హత కలిగిన వారికి సాంకేతిక సమస్యల ద్వారా జమ కాని పక్షంలో రైతులు వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలి.
ఎం విజయనిర్మల, జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి, ఖమ్మం