‘పల్లె ప్రగతి’ అంటే ఇదీ అని నిరూపిస్తున్నది మండలంలోని సుభాశ్నగర్ గ్రామ పంచాయతీ. గతంలో అరకొర వసతులతో ఇబ్బందిపడిన గ్రామస్తులకు మౌలిక వసతులు అందిస్తున్నది. వైకుంఠధామం, ప్రకృతి వనం, కంపోస్టు షెడ్, నర్సరీ ఏర్పాటుతో గ్రామం కొత్త కళను సంతరించుకున్నది. దీంతో సుభాశ్నగర్ .. ‘శెభాష్..’ అనిపించుకుంటున్నది. ఈ నేపథ్యంలో గ్రామంలో జరిగిన అభివృద్ధిపై ప్రత్యేక కథనం. ఇల్లెందు రూరల్, ఏప్రిల్ 8
మొక్కల పెంపకానికి ప్రాధాన్యం..
గ్రామ జనాభా 4,718 కాగా పంచాయతీలో 1,250 కుటుంబాలు నివసిస్తున్నాయి. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు 6,700 మొక్కలు పంపిణీ చేయగా వారు తమ ఇంటి ఆవరణలో వాటిని నాటి సంరక్షణ బాధ్యతలు చేపడుతున్నారు. పల్లె ప్రకృతి వనంలో 5,800 మొక్కలు, నర్సరీలో ప్రస్తుతం 1,650 మొక్కలు, ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 750 మొక్కలు పెరుగుతూ పచ్చందాలు తీసుకువచ్చాయి. ప్రధాన కూడలిలోని డివైడర్ మధ్య చేపట్టిన మొక్కల పెంపకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. మొక్కలకు పంచాయతీ సిబ్బంది క్రమం తప్పకుండా నీరు పెడుతున్నారు. గ్రామంలో వాలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి బిగించారు. రాత్రిళ్లు గ్రామస్తులు ఇబ్బంది పడకుండా వీధి దీపాలు ఏర్పాటు చేశారు.
పారిశుధ్యంలో ఆదర్శం..
గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు ప్రభుత్వం సమకూర్చిన ట్రాక్టర్ను పంచాయతీ పాలకవర్గం సద్వినియోగం చేస్తున్నది. కార్మికులు ప్రతిరోజూ తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ట్రాక్టర్, ట్రాలీ ద్వారా తరలిస్తున్నారు. గ్రామంలో అన్ని హంగులతో వైకుంఠధామం అందుబాటులోకి వచ్చింది. దహన సంస్కారాలకు అనుకూలంగా ఏర్పాట్లు ఉన్నాయి. పాలకవర్గం ప్రతినెలా విడుదలయ్యే నిధులను గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నది. సీసీ రోడ్లు, డ్రైన్లు, తాగునీటి సరాఫరా, పచ్చదనం తదితర అవసరాలకు వెచ్చిస్తున్నది.
మట్టికుండ…సల్లగుండ..
సుజాతనగర్, ఏప్రిల్ 8: మట్టి కుండలకు భలే గిరాకీ పెరుగుతున్నది. సామాన్యుడి ఫ్రీజ్గా పిలువబడే మట్టి కుండలో చల్లటి నీళ్లు తాగేందుకు జనం ఇష్టపడుతున్నారు. మట్టి కుండ ఉపయోగాలు తెలుసుకుంటున్న సామాన్యులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. మండల కేంద్రంలో కుండల వినియోగం బాగా పెరిగింది.
కుండ నీళ్లతో ప్రయోజనాలు
నీటిని సహజంగానే చల్లబరుస్తుంది.రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు, ఆస్తమాలను నివారిస్తుంది. శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. శరీరాన్ని లోపలినుంచి చల్లబరుస్తుంది. వడదెబ్బ నుంచి కాపాడుతుంది. మెటబాలిజం రేటు పెరుగుతుంది. అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా చేస్తుంది.
పచ్చందాల ఠాణా..
పచ్చదనంతో కళకళలాడుతున్న పోలీస్స్టేషన్..
ఈ పోలీస్ స్టేషన్ ఆహ్లాదానికి నిలయంగా ప్రకృతికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. పచ్చని చెట్లు.. సుగంధ ద్రవ్యాల మూలికలు.. పూలతో నందనవనాన్ని తలపిస్తున్నది. సాధారణంగా ఎవరూ పోలీస్ స్టేషన్ మెట్లేక్కడానికి ఇష్టపడరూ..! కానీ ఒక్కసారైనా ఈ పోలీస్స్టేషన్ పరిసరాలను చూడాలనిపిస్తుంది. ఇంతలా ఠాణాను పచ్చదనంతో తీర్చిదిద్దారు ఇక్కడి సిబ్బంది. ఇంతకీ ఈ పోలీస్ స్టేషన్ ఎక్కడుందంటారా! జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న ఈ పోలీస్స్టేషన్ సిబ్బంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం స్ఫూర్తితో మూడేళ్లుగా మొక్కలను పెంచుతున్నారు. పోలీస్స్టేషన్ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చారు. నందనవనంలో దాగిన ఇంద్రభవనంలా ఈ పోలీస్స్టేషన్ను తీర్చిదిద్దారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో గార్డెన్ చేసేందుకు లాన్గ్రాస్తో పాటు నైట్ క్వీన్, డే క్వీన్, గల్ ఫీమియా, ఆర్కీఫామ్, పూజా, ఫాక్స్ టేల్, తురాయి, గులాబి, మదారం,చామంతి, నందివర్ధనం, వివిధ రకాల పూల మొక్కలు, సుగంధ పరిమళాలు వెదజల్లే మొక్కలు తీగజాతి మొక్కలు, మారుజాతి మొక్కలు, పండ్ల మొక్కలను పెంచుతున్నారు. నైట్ క్వీన్, డే క్వీన్ సుగంధ మొక్కలు సువాసను వెదజల్లుతూ మరపురాని అనుభూతిని పంచుతున్నాయి. జాతీయ రహదారిని ఆనుకొని సువిశాలమైన స్థలంలో ఉన్న పోలీస్స్టేషన్ వైపు వాహనదారులు, బాటసారులు చూపు మరల్చకుండా చేస్తోంది ఇక్కడి వాతావరణం.
అందరి కృషితోనే..
గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితోనే పంచాయతీలో అభివృద్ధి సాధ్యమైంది. ప్రభుత్వం సమకూర్చిన ట్రాక్టర్తో పక్కా పారిశుధ్య నిర్వహణ చేపడుతున్నాం. మల్టీపర్పస్ వర్కర్లు ఎప్పటికప్పుడు గ్రామంలో పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం ద్వారా ప్రతి నెలా విడుదలయ్యే నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం.
మార్పు ఊహించలేదు..
మురికి కూపంలా ఉండే మా పల్లె ఇప్పుడు తన రూపురేఖలను మార్చుకున్నది. ఇప్పుడు పరిశుభ్రతకు మారుపేరు అయింది. ఇంతటి మార్పును ఎప్పుడూ ఊహించలేదు. రహదారులకు ఇరువైపులా పెరుగుతున్న మొక్కలు, ప్రకృతి వనంలో పెరుగుతున్న మొక్కలు పంచాయతీకి అందాలు తీసుకువచ్చాయ. నూతన పంచాయతీ ఏర్పాటు మంచి ఫలితాలు ఇచ్చింది.