నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్
వ్యవసాయంలో జిల్లాను రోల్మోడల్గా తీర్చిదిద్దాలి
భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్
లక్ష్మిదేవిపల్లి, జూన్ 11 : రైతు బాగుంటేనే మనం బాగుంటామని, అన్నదాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన విత్తనాలు, ఎరువులను విక్రయించాలని భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు రైతువేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ విస్తరణ, ఉత్పాదక అధీకృత డిప్లొమా కోర్సు పూర్తి చేసిన డీలర్లకు ఉత్తీర్ణత సర్టిఫికెట్ల అందించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంట ఉత్పత్తులు, సేంద్రియ పద్ధతులపై రైతులకు అవగాహన కోసం డీలర్లకు 2003లో డిపొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఇన్పుట్ డీలర్ల కోసం ఏడాది డిప్లొమో కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు రెండు బ్యాచ్లకు ఈ కోర్సులో శిక్షణ నిర్వహించామని, ప్రస్తుతం మూడో బ్యాచ్ నడుస్తుందన్నారు.
వ్యవసాయ రంగంలో ఉత్పాదకాల నియంత్రణకు సంబంధించిన చట్టాలు, ఇన్పుట్ డీలర్లకు అవగాహన కల్పించడం ద్వారా క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తిస్థాయిలో వివరించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. గ్రామస్థాయిలో వ్యవసాయ సమాచారం మొత్తం డీలర్లకు, వ్యవసాయ విస్తరణ సేవలు రైతులకు అందించడమే ప్రధాన లక్ష్యంగా కోర్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఆధునిక వ్యవసాయ ఉత్పత్తులు, సేంద్రియ పద్ధతుల ద్వారా పంట సాగు చేపట్టే విధంగా డీలర్లు కృషి చేయాలన్నారు. రైతుల బాగు కోసం డీలర్లు పనిచేయాలని, నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయంలో జిల్లాను రోల్మోడల్గా తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలన్నారు. అనంతరం కోర్సు పూర్తి చేసిన డీలర్లకు సర్టిఫికెట్లను అందించారు. డీలర్లు మువ్వా రమేశ్, నాగసీతారాములు మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకునే వ్యవసాయం చేయాలని, తమ వంతుగా రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, వ్యవసాయశాఖాధికారి అభిమన్యుడు, అధికారి మరియన్న, ఏడీలు రవికుమార్, లాల్చంద్, కోర్సు నిర్వహణాధికారి దామోదర్రెడ్డి పాల్గొన్నారు.