ఏడు సబ్జెక్టులకు వర్క్షీట్ల తయారీ
పోస్టు ద్వారా విద్యార్థుల ఇళ్లకే పంపిణీ
గిరిజన సంక్షేమ శాఖ డీడీ రమాదేవి
భద్రాచలం, జూన్ 11 : రాష్ట్రవ్యాప్తంగా 2021-22 విద్యాసంవత్సరంలో పదోతరగతి చదువుతున్న 1,10,000 మంది విద్యార్థుల కోసం భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ డీడీ రమాదేవి తెలిపారు. శుక్రవారం ఆమె ‘నమస్తే’తో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒక్కో తరగతికి ఒక్కో జిల్లాను కేటాయించిందని, దీనిలో భాగంగా 10వ తరగతిని భద్రాద్రి జిల్లాకు కేటాయించారన్నారు. పదోతరగతిలోని ఏడు సబ్జెక్టులపై ఏడుగురు టీచర్లను నియమించి వర్క్షీట్లు తయారు చేయిస్తామన్నారు. వాటిని బుక్లెట్లా తయారు చేసి పోస్ట్ ద్వారా విద్యార్థుల ఇళ్లకు పంపిస్తామన్నారు. ప్రస్తుతం విద్యార్థులు ఖాళీగా ఉంటున్నందున వర్క్ షీట్లు విద్యకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వాటిని నింపిన తర్వాత విద్యార్థులు తిరిగి వారు చదువుతున్న పాఠశాలకు పంపించాల్సి ఉంటుందన్నారు. వాటి ఆధారంగా ఉపాధ్యాయులు మార్కులు వేస్తారన్నారు.