ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్కు
నివేదించిన బాధితులు
తక్షణం సమస్యకు పరిష్కారం చూపాలని ఖమ్మం కలెక్టర్ కర్ణన్కు ఆదేశాలు
ఖమ్మం జూన్ 5 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): రెవెన్యూశాఖ పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలని ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు వేర్వేరుగా రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా సమస్యను విన్నవించారు. డిజిటల్ సైన్ పూర్తి కాకపోవడంతో తమకు ‘రైతుబంధు’ అందడం లేదని, రైతుబంధు అందేలా చూడాలని కోరారు. మంత్రి వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తక్షణం డిజిటల్ సిగ్నేచర్..
కూసుమంచి మండలం మునిగేపల్లికి చెందిన వేగినాటి కృష్ణవేణికి తన పుట్టింటి వారు 37 కుంటల భూమి ఇచ్చారు. సదరు భూమి కృష్ణవేణి పేరిట ధరణిలో సైతం నమోదైంది. కానీ కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో డిజిటల్ సైన్ కాలేదు. దీంతో ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు అందడం లేదు. దీని కోసం బాధితురాలు చాలాకాలం నుంచి రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నది. దీంతో ఆమె కుమారుడి సాయంతో సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లింది. బాధితురాలి ఆవేదనను అర్థం చేసుకున్న మంత్రి కేటీఆర్ వెంటనే సమస్యను పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు మెయిల్ ద్వారా ఆదేశించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెంటనే స్పందించి డిజిటల్ సైన్ పూర్తి చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. కూసుమంచి తహసీల్దార్ వెంటనే డిజిటల్ సైన్ చేశారు. దీంతో మహిళా రైతు కృష్ణవేణి సమస్యకు పరిష్కారం దొరికింది.
మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు..
మీనవోలులో మాకు 3.31 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. గత సంవత్సరం వరకు నాకు ప్రభుత్వం అందజేస్తున్న రైతుబంధు వచ్చింది. కానీ గతేడాది సాంకేతిక కారణాలతో నగదు అందలేదు. ఈ విషయాన్ని మా సోదరుడు అనీల్కుమార్రెడ్డి మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా విన్నవించడంతో ఆయన వెంటనే స్పందించారు. సమస్యను పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు ఆదేశాలు రావడంతో సమస్యకు పరిష్కారం దొరికింది. సామాన్యులు విన్నవించిన సమస్యను సహృదయంతో స్వీకరించి పరిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు.
శీలం అపర్ణ, మీనవోలు,
ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా
రైతుబంధుకు లైన్ క్లియర్..
ఎర్రుపాలెం మండలం మినవోలు గ్రామానికి చెందిన శీలం అపర్ణకు గ్రామంలో 3.31 ఎకరాల భూమి ఉన్నది. భూమికి అన్ని రకాల ఆధారాలు ఉన్నా రైతుబంధు అందడం లేదని సమస్యను ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లింది. మంత్రి వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు మెయిల్ ద్వారా ఆదేశించారు. కలెక్టర్ వెంటనే స్పందించి బాధితురాలి సమస్యను పరిష్కరించాలని సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులు సాంకేతిక సమస్యను అధిగమించి ధరణి పోర్టల్ ద్వారా బాధితురాలి భూమికి డిజిటల్ సైన్ చేశారు. దీంతో సమస్యకు పరిష్కారం లభించింది. త్వరలో మహిళా రైతుకు రైతుబంధు నగదు అందనుంది.
మంత్రి కేటీఆర్కు రుణపడి ఉంటా..
మా భూమికి డిజిటల్ సైన్ ప్రక్రియ చేయాలని మంత్రి కేటీఆర్కు విన్నవించగానే వెంటనే స్పందించారు. ఇంత తొందరగా సమస్యకు పరిష్కారం దొరుకుతుందనుకోలేదు. సమస్యపై అనేకసార్లు రెవెన్యూ అధికారులను కలిశాను. అయినా పని కాలేదు. మా సమస్యకు పరిష్కారం దొరకడం ఆనందాన్నిచ్చింది. మంత్రి కేటీఆర్కు రుణపడి ఉంటా.
కృష్ణవేణి, తల్లంపాడు, ఖమ్మం రూరల్ మండలం