మొదటి రోజు ప్రయాణికులకు వెసులుబాటు
ఆంధ్రప్రదేశ్లో పగలూ కర్ఫ్యూ
నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి పక్కాగా అమలుకు నిర్ణయం
అశ్వారావుపేట/ బోనకల్లు/ మధిర రూరల్/ పెనుబల్లి/ ఎర్రుపాలెం/ బూర్గంపహాడ్/ సత్తుపల్లి, మే 5 : కరోనా కట్టడికి పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో సరిహద్దు కలిగిన పలు చెక్పోస్టులను ఆంధ్రా అధికారులు మూసివేశారు. మొదటి రోజు కావడంతో కొన్నిచోట్ల అధికారులు తాత్కాలిక అనుమతి ఇచ్చారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆ రాష్ట్రం ఇప్పటికే రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ కర్ఫ్యూను అమలు చేస్తోంది. బుధవారం నుంచి అదనంగా పగటి పూట కూడా పాక్షికంగా అదే కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే వ్యాపార కేంద్రాలు తెరవాలని, ఆ తరువాత అత్యవసర సేవలను మాత్రమే అనుమతించాలని, మధ్యాహ్నం 12 తరువాత కర్ఫ్యూను అమలు చేయాలని, ఐదుగురికి మించి ఒకచోట గుమికూడవద్దని, 144 సెక్షన్ కింద నిషేధాలు అమలులో ఉంటాయని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రా అధికారులు ఉమ్మడి జిల్లా సరిహద్దుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి చెక్పోస్టులను మూసివేశారు. అశ్వారావుపేట పట్టణ సమీపంలోని అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు మూతపడింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆంధ్రా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను బంద్ చేశారు. మొదటి రోజు ప్రయాణికుల రవాణాకు వెసులుబాటు కల్పించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులను ఆంధ్రప్రదేశ్లోకి వెళ్లడానికి అనుమతించారు. కొందరు వాహనదారులు అవగాహన లేమితో వస్తున్నందున వారికి కచ్చితమైన సమాచారం అందించి రాష్ట్రంలోకి అనుమతిస్తున్నట్లు చెప్పారు.
గురువారం నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇదే మండలంలోని రామన్నగూడెం, రాచన్నగూడెం గ్రామాల తెలంగాణ సరిహద్దుల్లోనూ ఆంధ్రా అధికారులు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను అనుమతించడం లేదు. దీంతో వాహనదారులు వెనుదిరిగి వచ్చేస్తున్నారు. మరో పక్క తెలంగాణ అధికారులు సైతం సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపడుతున్నట్లు సమాచారం. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలిసింది. బోనకల్లు నుంచి ఏపీలోని విజయవాడ వెళ్లేందుకు ప్రధాన రోడ్డు మార్గం కావడంతో నిత్యం ఈ మార్గంలో వందలాది వాహనాలు తిరుతుంటాయి. అత్యవసర సేవలందించే వాహనాలను మాత్రమే ఈ మార్గంలో వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మధిర రూరల్ మండలం జొన్నలగడ్డ, రాజవరం చెక్పోస్టుల వద్ద ఏపీ అధికారులు వాహనాలను నిలిపివేశారు. పెనుబల్లి మండలం ముత్తగూడెం ఆర్టీఏ చెక్పోస్టు వద్ద అధికారులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎర్రుపాలెం మండలంలో ఆంధ్రా తెలంగాణ సరిహద్దు గ్రామాలైన ఎర్రుపాలెం, కొత్తపాలెం, రాజుపాలెం, గట్లగౌరవరం, బీమవరం హరిజనవాడ, రామన్నపాలెం చెక్పోస్టుల వద్ద తొలిరోజు ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. బూర్గంపహాడ్ సమీపంలో ఆంధ్రాలోని కుక్కునూరు శివారు గ్రామమైన వేలేరు వద్ద, సత్తుపల్లి వద్ద ఆంధ్రా పోలీసులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వాహనాలను అనుమతించారు.