నోటిఫికేషన్ జారీచేసిన ఎన్నికల కమిషన్
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
ఎన్నిక కోసం రేపు ఖమ్మానికి టీఆర్ఎస్ పరిశీలకులు
రెండు పదవుల ఏకగ్రీవానికే అవకాశం
ఒకటికి మించి నామినేషన్లు వస్తే చేతులెత్తే పద్ధతి ద్వారా ఎన్నిక
ఖమ్మం, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ నెల 7న నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఖమ్మం నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ను ఎన్నుకోవడం ఇది రెండోసారి. 2016లో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుంది. దాని పాలకవర్గం గడువు ముసిగింది. గత నెల 30న జరిగిన రెండో దఫా ఎన్నికల్లోనూ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేతృత్వంలో టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించింది. ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ పీఠం టీఆర్ఎస్ పరంకానుంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో ఈ నెల 7న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ప్రమాణస్వీకారం చేయడానికి హాజరుకావాల్సిందిగా నూతన కార్పొరేటర్లకు సమాచారం పంపించే పనిలో నిమగ్నమయ్యారు. కో ఆప్షన్ పదవులను సైతం టీఆర్ఎస్ కైవసం చేసుకునేందుకు పూర్తిస్థాయి మెజార్టీ ఉండడంతో ఎన్నిక లాంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ కార్పొరేటర్లను సమన్వయం చేసేందుకు పార్టీ అధిష్ఠానం ఇద్దరు పరిశీలకులను నియమించింది. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డిలను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్లు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని టీఆర్ఎస్ తరఫున గెలుపొందిన కార్పొరేటర్లు ఇప్పటికే తీర్మానం చేసి అధిష్ఠానానికి పంపించారు.
మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో టీఆర్ఎస్ తరఫున జనరల్ మహిళా స్థానాల నుంచి గెలుపొందిన వారు ఆ పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ మేయర్ పదవిని పురుషులకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పదవికి సైతం పలువురు కార్పొరేటర్లు తమ పేర్లను పరిశీలించాల్సిందిగా అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే మేయర్, డిప్యూటీ మేయర్లు ఖరారుకానున్నారు. ఈ ఎన్నికకు సంబంధించి నగరపాలక సంస్థ అధికారులు ఈ నెల 7న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలుపొందిన 60 మంది కార్పొరేటర్లతో తొలుత ప్రమాణస్వీకారం చేయించి ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పోటీచేసే వారి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఆ పదవులకు ఒక్కో నామినేషన్ దాఖలైన పక్షంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. దానిని ఆ ప్రత్యేక సమావేశంలో ప్రకటిస్తారు. ఒక్కొక్క పదవికి ఒకటికి మించి నామినేషన్లు దాఖలైతే ప్రత్యేక సమావేశంలో చేతులెత్తే పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహించనున్నారు. అయితే ఖమ్మం నగరపాలక సంస్థకు సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఏకగ్రీవం కానున్నాయి. ఈ ప్రత్యేక సమావేశానికి ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధ్యక్షత వహించనున్నారు.