పక్కా ప్రణాళికతో అభివృద్ధి
ఆహ్లాదాన్ని పంచుతున్న ప్రకృతి వనాలు
పల్లె ప్రగతితో మారిన గ్రామరూపురేఖలు
పినపాక, ఏప్రిల్ 3: ఒకప్పుడు ఆ పల్లె సమస్యలతో సతమతమైంది. తాగునీరందక ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిచ్చేది. అంతర్గత రహదారులన్నీ అస్తవ్యస్తంగా ఉండేవి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో ఆ గ్రామ రూపరేఖలు మారాయి. పినపాక మండలం తోగ్గూడెంలో జరిగిన అభివృద్ధి, సమకూరిన వసతులపై ‘నమస్తే తెలంగాణ’ కథనం
తోగ్గూడెం పంచాయతీ ప్రగతి పథంలో పయనిస్తున్నది. ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం కొత్త పంచాయతీల్లో భాగంగా ఈ గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేసింది. గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులతో పంచాయతీ ముఖచిత్రమే మారిపోయింది.
తోగ్గూడెం పంచాయతీలో తోగ్గూడెం, గోపాలరావుపేట, గోవిందాపురం గ్రామాలున్నాయి. పంచాయతీ జనాభా 1804, నివాస గృహాలు 554, గ్రామ ఓటర్లు 1440. పంచాయతీ అభివృద్ధ్దికి ప్రతి నెల రూ.2.75 లక్షల నిధులను ప్రభుత్వం అందజేస్తున్నది. గతేడాది పంచాయతీ అభివృద్ధికి మొత్తం ప్రభుత్వం సుమారు రూ.25 లక్షలు ఇచ్చింది. 10 శాతం నిధులు గ్రీనరీ, 15శాతం పారిశుధ్యం, 10 శాతం వీధిలైట్ల నిర్వహణ, 5 శాతం పంచాయతీ కార్యాలయ నిర్వహణకు.. మిగిలినవి పలు అభివృద్ధ్ది కార్యక్రమాలకు కేటాయించారు. పారిశుధ్య కార్మికులకు, పంచాయతీ సిబ్బంది వేతనాలకు గతేడాది రూ.2.50 లక్షలు ఖర్చు చేశారు. కరెంటు బిల్లుల కోసం మరో రూ.4 లక్షలు ఖర్చు చేశారు.
పంచాయతీలో మూడు ప్రకృతి వనాల్లో వివిధ రకాల 7వేల పూల, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్లో మరో 800 మొక్కలు పెంచుతున్నారు. పంచాయతీ అభివృద్ధి కోసం సుమారు రూ.6 లక్షలు వెచ్చించి ట్రాక్టర్, ట్యాంకర్ను కొనుగోలు చేశారు. ఈ ట్రాక్టర్తో నిత్యం చెత్త సేకరణతోపాటు ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీళ్లు పడుతూ సంరక్షిస్తున్నారు. మిషన్ భగీరథ మోటార్ల ద్వారా గ్రామానికి రెండు పూటల తాగునీరందిస్తున్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా రూ.12.5 లక్షలతో వైకుంఠధామం, రూ.2.5 లక్షలతో డంపింగ్యార్డును నిర్మించారు. రూ.35 వేలు ఖర్చు చేసి పాడుబడ్డ బావులు, పాత భవనాలను కూల్చేశారు. పంచాయతీలోని మూడు గ్రామాల్లో రూ.8 లక్షలు వెచ్చించి 30 గ్రావెల్ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. అయితే, పంచాయతీ భవనం లేకపోవడంతో గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఓ గదిలో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇటీవల పంచాయతీ భవనానికి రూ. 20 లక్షలు మంజూరు చేసింది. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సరిపడా వాటర్ ట్యాంకులు లేకపోవడంతో తాగునీటికి కొంత ఇబ్బందులు ఉన్నాయి. పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇవి కూడా చూడండి..
మసీదు ముందు ప్రచారం.. ఖుష్బూపై కేసు
ఆయుధాలను వదిలేయండి.. జనజీవన స్రవంతిలో కలవండి: ప్రధాని మోదీ