పల్లె ప్రగతిలో ముందంజ
అన్ని వసతులతో వైకుంఠధామ నిర్మాణం
ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో గ్రామాభివృద్ధి
కూసుమంచి రూరల్, మార్చి 19 : స్వరాష్ట్రం వచ్చాక పల్లెలు ప్రగతి బాట పట్టాయి. తెలంగాణ సర్కార్ గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో గ్రామస్తులకు మౌలిక వసతులు సమకూరాయి. ప్రతి పల్లెలో అన్ని వసతులతో వైకుంఠధామం, ఆహ్లాదాన్ని పంచేందుకు పల్లె ప్రకృతి వనం, చెత్తా చెదారాన్ని తరలించేందుకు డంపింగ్యార్డు ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పాలకవర్గాలు నిధులను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ లక్ష్యాలను చేరుకుంటున్నాయి. ప్రగతి పనుల్లో జక్కేపల్లి పంచాయతీ ముందంజలో ఉన్నది. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకుంటున్నది. గ్రామంలో 260 ఇండ్లు ఉండగా జనాభా 1080. పల్లె ప్రగతి పనుల్లో భాగంగా పాలకవర్గం గ్రామంలోని వైకుంఠధామం వద్దకు గ్రావెల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసింది. కంప చెట్లను తొలగించింది. రూ.7 లక్షల ప్రభుత్వ నిధులతో రెండు సీసీ రోడ్లు, రూ.3 లక్షలతో మురుగునీటి కాలువలు నిర్మించింది. రూ.12.50 లక్షలతో ఎకరా విస్తీర్ణంలో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్యార్డ్ పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. పంచాయతీ కార్యాలయం పక్కన ఉన్న అర ఎకరా స్థలంలో ఏర్పాటైన పల్లె ప్రకృతి వనం గ్రామానికి ఆకర్షణగా నిలుస్తున్నది. ప్రభుత్వం నుంచి నెలానెలా వచ్చే గ్రాంట్స్తో ట్రాక్టర్ నిర్వహణ, రుణ వాయిదాల చెల్లింపులు, గుమస్తా, పారిశుధ్య సిబ్బంది జీత భత్యాలు పోగా మిగిలిన నిధులతో పాలకవర్గం అభివృద్ధి పనులు చేపడుతున్నది. భూగర్భజలాలు పెంచేందుకు ప్రభుత్వం వందశాతం రాయితీతో ఇంకుడు గుంతలు మంజూరు చేసింది. గ్రామంలో ఇప్పటివరకు 136 నిర్మాణాలు పూర్తయ్యాయి. విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు సర్పంచ్ కుటుంబీకులు సుమారు రూ.50 వేల వరకు సొంత నిధులు ఖర్చు చేశారు.
ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతాం..
జక్కేపల్లిని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతాం. పల్లె ప్రగతి పనులకు సొంతనిధులు వినియోగించాం. ప్రభుత్వం అందించే నిధులను సద్వినియోగం చేశాం. వైకుంఠధామం, పల్లె పార్కు, సీసీ రోడ్లు, డంపింగ్ యార్డ్ నిర్మాణాల్లో ఎక్కడా రాజీ పడలేదు. పీఏసీఎస్ చైర్మన్ నలబోలు చంద్రారెడ్డి, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.