పర్ణశాల : కేంద్ర, రాష్ట్ర ఆదేశాల మేరకు పోషణ్ అభియాన్ వారోత్సవాలను మండలంలోని పర్ణశాల, బండిరేవు, పెద్దనల్లబల్లి, గౌరారం, నల్లబెల్లి, ప్రగళ్లపల్లి గ్రామాల్లో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సూరారం అంగన్వాడీ కేంద్రంలో జడ్పీటీసీ సీతమ్మ, గౌరారం కేంద్రంలో సర్పంచ్ జ్యోతిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1 నుంచి 30వ తేదీవరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు.
గర్భిణులు, బాలింతలకు, చిన్నారులకు పోషకాహారంపై పలు సూచనలు చేస్తూ వాటిని ప్రతిఒక్కరూ పాటించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా గ్రామాల వైద్యసిబ్బంది వచ్చి బాలింతలు, గర్భిణులకు అందించే ఆరోగ్య సలహాలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, ఆయాలు, వైద్యసిబ్బంది, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.