భద్రాచలం, ఏఫ్రిల్ 17 : శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నవాహ్నిక మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉదయం ఉత్సవమూర్తుల (స్వర్ణ మూర్తుల)ను బేడా మండపంలో వేంచేయింప చేశారు. అనంతరం మేళతాళాల నడుమ పవిత్ర గోదావరి నది గర్భం (500 నదులు కలిసి ఉన్న) నుంచి జలాలను వెండి తీర్థపు బిందెలో తీసుకొని వచ్చారు. ముందుగా సమస్త మంగళవాయిధ్యాలు, వేద ఘోషలతో ఆచార్య, బ్రహ్మ రుత్విక్లతోనూ ఆలయ అధికారులతో అంతరాలయంలోని మూల మూర్తుల వద్ద దైవ ప్రార్థన చేశారు. అనంతరం బేడా మండపంలో విశ్వక్సేన ఆరాధన, భగవత్ పుణ్యాఃవాచన, కంకణధారణ, పరిషద్రక్షణ, రక్షాబంధన, దీక్షా కవచధారణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీరామ నవమి రోజున సీతారామ కల్యాణంలో పాల్గొనే ఆచార్య, బ్రహ్మ రుత్విక్లకు, వేద పారాయణదారులకు, వేద పండితులకు, భారత, రామాయణ, ఇతిహాస పురాణాదుల వారికి, ఆలయ హరిదాసులకు దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ దంపతుల చేతుల మీదుగా దీక్షా వస్ర్తాలు పంపిణీ చేశారు.
అనంతరం సీతారామ, లక్ష్మణులకు నవకలశ స్నపనం నిర్వహించారు. ఉత్సవమూర్తులకు పంచామృతాలతో, 9రకాల పండ్ల రసాలతో, హరిద్రాచూర్ణంతో, గంథోదకంతో, సహస్రధారలతో ఉత్సవాంగ స్నపనం జరిపారు. అర్చకులు పంచ ఉపనిషత్తులను పఠిస్తూ కుంభ, ధ్వజ, అష్ట, ద్వాదశ హారతులను స్వామివారికి సమర్పించారు. సాయంత్రం లక్ష్మి తాయారమ్మ వారి సన్నిధిలో మృత్సంగ్రహణం (పుట్టమన్నుతో పూజ), యాగశాలలో నవధాన్యాలతో అంకురార్పణ, అఖండ దీపారాధన, ద్వారతోరణ పూజ, అంకురారోపణ హవనం, వాస్తు హోమం, ఇడాహవాచన జరిపారు. రామయ్య తండ్రి దీక్షలో ఉన్నందున ఈ రోజు నుంచి ఏకాంత సేవలు, సుప్రభాత సేవలు, దర్భార్ సేవలు నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రావణ్కుమార్, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, ఉప ప్రధానార్చకులు అమరవాది వెంకట శ్రీనివాస రామానుజం, గోపాలకృష్ణమాచార్యులు, అమరవాది మురళీ కృష్ణామాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.
నేడు గరుడ ధ్వజ పట లేఖనం
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం గరుడ ధ్వజ పట లేఖనం (గరుడ పటాన్ని చిత్రీకరిస్తారు) జరుపుతారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఉన్న ధ్వజ స్థంభంవద్ద గరుడ పటావిష్కరణ నిర్వహిస్తారు. అదేవిధంగా భగవద్రామానుజుల వారి తిరు నక్షత్రాన్ని పురస్కరించుకొని రామానుజుల స్వామివారికి స్నపన తిరుమంజనం, రాత్రికి చుట్టు సేవ జరుపుతారు. రాత్రికి విశేష భోగ నివేదనలో భాగంగా మథుర పదార్ధాన్ని నివేదన చేస్తారు.