కొత్తగూడెం, మే 2 : యాసంగి ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ముమ్మరం చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. సరిపడా గన్నీ బ్యాగులనూ సిద్ధంగా ఉంచింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలిస్తున్నది. యాసంగిలో 90వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేరరించాలని మార్కెటింగ్శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ శాఖ గతేడాది యాసంగిలో 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ ఏడాది చెరువుల్లో నీరు పెరగడంతో పంట సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో యాసంగి లక్ష్యం పెరగవచ్చని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. ఇప్పటికే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం, జీసీసీ, మార్కెటింగ్, ఐకేపీ శాఖల ద్వారా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కలెక్టర్ ఎంవీ రెడ్డి ఇప్పటికే ఆయాశాఖల తో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా కేంద్రాలు అందుబాటులో ఉంచాలని సూచనలిచ్చారు. ప్రతిరోజు కొనుగోలు కేంద్రాల్లో ఎంత ధాన్యం కొనుగోలు చేస్తున్నారో తెలపాలని ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవాలన్నారు.
జిల్లాలో 151 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో 151 (పీఏసీఎస్ 112, ఐకేపీ 14, ఏఎంసీ 8, జీసీసీ 17) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే 42 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గన్నీ బ్యాగ్ల కొరత లేకుండా మార్కెటింగ్ శాఖ ముందస్తు ఏర్పాట్లు చేసింది. మొత్తం కొనుగోళ్లకు 22 లక్షల గన్నీ బ్యాగ్లు కావాల్సి ఉండగా ఇప్పటికే 16.50 లక్షలను అందుబాటులో ఉంచింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసింది.
90 వేల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా సేకరణ
గత యాసంగితో పోల్చితే ఈ యాసంగిలో ఎక్కువ ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది 60వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఈ ఏడాది 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే కొత్తగూడెం, చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, అశ్వారాపుపేట, ఇల్లెందు ఏరియాల్లో వరి పంటను కోసి కల్లాలకు చేర్చారు. బస్తాల్లో నింపి విక్రయానికి సిద్ధంగా ఉంచారు. కొన్నిచోట్ల విక్రయాలు జరుగుతున్నాయి.
ఇప్పటివరకు 42 కేంద్రాల్లో కొనుగోళ్లు
ఇప్పటివరకు 42 కేంద్రాల్లో 5,682 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 569 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.10.67 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ఖాతాల్లో జమ చేసేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు.
గిట్టుబాటు ధర నిర్ణయించాం
వానకాలం పంటలాగానే ధాన్యానికి మంచి గిట్టుబాటు ధర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ-1 గ్రేడ్ రకానికి రూ.1,888; కామన్ రకానికి రూ.1,868 ఇస్తున్నది. గన్నీ బ్యాగ్లూ సిద్ధంగా ఉన్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.
-ప్రసాద్, సివిల్ సైప్లె జిల్లా మేనేజర్, కొత్తగూడెం