అశ్వారావుపేట: నాణ్యమైన పంట దిగుబడుల కోసం భూమిని ఎప్పటికప్పుడు సంరక్షించుకోవాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.ఎం.మాధవి, ఎస్బీఐ కొత్తగూడెం రీజనల్ మేనేజర్ మహేశ్వర్లు రైతులకు సూచించారు. భూసార పరీక్షల ద్వారా భూమి ఆరోగ్యాన్ని కాపాడవచ్చని అన్నారు. ప్రపంచ మృత్తిక దినోత్సవం పురష్కరించుకుని మండలంలోని మద్దికొండ దత్తత గ్రామంలో ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) సౌజన్యంతో శనివారం భూసార పరీక్ష ఆవశ్యకత-సమగ్ర ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ భూమి ఆరోగ్యంగా ఉంటేనే మన ఆరోగ్యం సురక్షితమని చెప్పారు. రైతులు వ్యవసాయ విజ్ఙానాన్నిపెంపొందించుకోవడానికి కళాశాల బోధనా సిబ్బంది పూర్తి సహకారం అందిస్తారని ప్రకటించారు. ఆధునిక వ్యవసాయ పద్దతులను పాటిస్తూ రైతులు ఆర్థిక బలోపేతం కావటంతో పాటు భారత వ్యవసాయ రంగం పురోగతికి తోడ్పాటునందించాలని సూచించారు. భూమి ఆరోగ్యం పెంపొందించేందుకు దోహదపడే సేంద్రియ, వానపాములు, జీవన ఎరువులు, పఛ్చిరొట్ట ఉపయోగాలను వివరించారు.
అనంతరం నేల ఆరోగ్యం-పరిరక్షించుకోవటం అంశంపై రైతులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన రైతులకు బహుమతులు అందజేశారు. విద్యార్ధులకు డ్రాయింగ్, వ్యాసరచన, డాక్యుమెంటరీ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ప్రోత్సాహకాలు అందించారు. అనంతరం కళాశాల ల్యాబ్లో తయారు చేసిన జీవన ఎరువులను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల శాస్త్రవేత్తలు డా.ఎం.రాం ప్రసాద్, డా.జి.గోపాలకృష్ణమూర్తి, డా.ఎం.సిద్దప్ప, డా.కె.శిరీష, డా.పి.శ్రీలత, డా.ఆర్.రమేష్, లక్ష్మణ్రావు, దత్తత గ్రామ నిర్వాహకులు ఎల్.రాజు, ఎస్బీఐ మేనేజన్ శ్రీహర్ష, ప్రదీప్ చక్రవర్తి, పలువురు రైతులు పాల్గొన్నారు.