జూలూరుపాడు: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ముగ్గురు విద్యార్ధినులకు కరోనా సోకింది. పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు 255 మంది విద్యార్ధులు చదువుతున్నారు. వీరిలో గురువారం 176 మంది విద్యార్ధినులు తరగతులకు హాజరయ్యారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్ధినులకు జలుబు, దగ్గు, జ్వరం ఉండటంతో ఆరుగురు విద్యార్ధులకు స్ధానిక ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షల్లో ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది హాస్టల్లోని విద్యార్ధులందరికీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మరొకరికి పాజిటీవ్ గా తేలింది. దీంతో మొత్తం ముగ్గురికి కరోనా ఉన్నట్లు వెల్లడైంది. కరోనా సోకిన విద్యార్ధినులను ఐసోలేషన్లో ఉంచి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు మండల విద్యాశాఖాధికారి గుగులోత్ వెంకట్, ఎస్వో పద్మజ తెలిపారు.