తొలిసారి రాష్ట్రస్థాయిలో కౌన్సెలింగ్
అర్హతల ఆధారంగా 11 మందికి సివిల్ సర్జన్ హోదా
9 మంది ఖమ్మం సర్కారు దవాఖానకే కేటాయింపు
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన వైద్యులు
ఖమ్మం సిటీ, జూలై 26 : ఖమ్మం జిల్లా వైద్య విధాన పరిషత్కు చెందిన 11 మందికి సివిల్ సర్జన్స్గా ప్రమోషన్ లభించింది. సోమవారం హైదరాబాద్లోని డైరెక్టరేట్లో కౌన్సిలింగ్ నిర్వహించి అక్కడికక్కడే పోస్టింగ్స్ ఖరారు చేశారు. ప్రభుత్వ వైద్యుల సీనియారిటీ, సామర్థ్యాన్ని గౌరవించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యంత పారదర్శకంగా కౌన్సిలింగ్ నిర్వహించాలని సంబందితశాఖ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఉద్యోగోన్నతి పొందిన వారిని ఇతర ప్రాంతాలకు పంపించకుండా క్యాడర్ సంఖ్యను పెంచి ఇప్పటి వరకు పని చేస్తున్న దగ్గరే పోస్టింగ్స్ ఇవ్వాలని సూ చించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ వై ద్య విధాన పరిషత్ రాష్ట్ర యంత్రాంగం ఏక కాలంలో కౌ న్సిలింగ్ పద్ధతిన ప్రమోషన్స్, పోస్టింగ్స్ ప్రక్రియను పూర్తిచేశారు. దీంతో అర్హతలున్న వారికి న్యాయం జరిగింది.
పెద్దాసుపత్రిలో 11 మందికి..
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం 11 మంది డాక్టర్స్కు ప్రమోషన్ లభించింది. ఆర్థోపెడిక్ విభాగంలో ఆర్ఎంవో డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, జనరల్ సర్జన్ విభాగంలో డాక్టర్స్ ఇస్సంపల్లి వెంకటేశ్వర్లు, సీహెచ్ వినయ్కుమార్, వెంకటాద్రి, జనరల్ మెడిసిన్ విభాగంలో డాక్టర్స్ ఎం నాగేశ్వరరావు, బీ నాగేశ్వరరావు, టర్మటాలజీ విభాగంలో డాక్టర్ అమర్సింగ్, అనస్తీషియా విభాగంలో డాక్టర్ రాజశేఖర్గౌడ్, డాక్టర్ రాణి సువిధ, ప్యాథాలజీ విభాగంలో డాక్టర్ బాలు, కంటి వైద్య నిఫుణులు డాక్టర్ శ్రీధర్గౌడ్ సివిల్ సర్జన్స్గా ఉద్యోగోన్నతి పొందారు. జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ బీ నాగేశ్వరరావు కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానకు, జనరల్ సర్జన్ వెంకటాద్రి హుజూర్నగర్కు బదిలీపై వెళ్లారు. మిగిలిన తొమ్మిది మందితోపాటు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన నుంచి అనస్తీషియా డాక్టర్ ప్రమోద్రెడ్డిని ఖమ్మం పెద్దాసుపత్రికి కేటాయించారు. ఈ ప్రకారం మొత్తం 10 మంది సివిల్ సర్జన్స్ జిల్లా కేంద్రంలోని హాస్పిటల్లో వైద్యసేవలు అందించనున్నారు. ప్రమోషన్స్ దక్కడం సీఎం కేసీఆర్ పుణ్యమేనని ప్రభుత్వ వైద్యులు పేర్కొంటున్నారు.