ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షం
రోజంతా కురిసిన జల్లులు
చెరువులు, కుంటలకు భారీగా వరద
ఉప్పొంగిన వాగులు, వంకలు
కొత్తగూడెం/ ఖమ్మం వ్యవసాయం/ వైరా/ పాల్వంచ రూరల్, జూలై 21: వాన ఎడతెగలేదు. బుదవారం తెల్లవారుజాము నుంచి మొదలుకొని రాత్రి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తూనే ఉంది. ఖమ్మం నగరంలో జనజీవనానికి కాస్త ఇబ్బంది ఏర్పడింది. ఇక రెండు జిల్లాల్లోనూ వాగులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. చెరువుల్లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. రైతులకు వర్షాలు కలిసిరావడంతో పొలం పనుల్లో బిజీ అయ్యారు. సింగరేణి ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సగటున 15.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తల్లాడలో 35.4, రఘునాథపాలెంలో 26.8, కల్లూరులో 26.8, వేంసూరులో 25.8, సత్తుపల్లిలో 25.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా సగటున 45.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పినపాకలో 47.2, చర్లలో 48.2, దుమ్ముగూడెంలో 85.4, అశ్వాపురంలో 55.2, మణుగూరులో 63.4, గుండాలలో 64.6, ఇల్లెందులో 21.2, టేకులపల్లిలో 39.2, జూలూరుపాడులో 29.2, చండ్రుగొండలో 47.2, కొత్తగూడెంలో 40.2, పాల్వంచలో 30.2, బూర్గంపహాడ్లో 41.2, భద్రాచలంలో 29.6. ములకలపల్లిలో 30.2, దమ్మపేటలో 60.6, అశ్వారావుపేటలో 41.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
‘వైరా’ నీటిమట్టం 18.9 అడుగులు
వైరా రిజర్వాయర్ నీటిమట్టం 18.9 అడుగులకు చేరుకున్నది. మూడు రోజుల క్రితం 18 అడుగులుగా ఉంది. క్యాచ్మెంట్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగుల ద్వారా రిజర్వాయర్లోకి వరదనీరు ప్రవహిస్తోంది. బుధవారం సాయంత్రానికి నీటిమట్టం 18.9 అడుగులకు చేరుకున్నది. దీంతో రిజర్వాయర్ చిన్నఅలుగు, పెద్దఅలుగుల ద్వారా వరదనీరు వైరా నదిలోకి ప్రవహిస్తోంది.
కిన్నెరసాని నుంచి నీటి విడుదల
కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి బుధవారం రాత్రి రెండు గేట్లు ఎత్తి పది వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేయనున్నారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 402 అడుగులుగా ఉంది.