రాష్ట్రమంతా పండుగలా హరితహారం కొనసాగుతున్నది. సెలబ్రిటీలు సైతం మొక్కలు నాటి పుడమితల్లి రుణం తీర్చుకుంటున్నారు. ఈ మహాక్రతువులో మేముసైతం అంటూ చిట్టి చేతులు కలిపారు ఇద్దరు అక్కాతమ్ముళ్లు. ఒకటి కాదు, రెండు కాదు 200 మామిడి మొక్కలను సిద్ధం చేశారు. వాటిని హరితహారంలో భాగం చేస్తున్నారు నిజాంపేటకు చెందిన దిశిత, సహర్ష్. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన ఈ చిన్నారుల ప్రయత్నాన్ని వారి తండ్రి రాంబాబు ట్విట్టర్లో పోస్ట్ చేసి, మంత్రి కేటీఆర్ను ట్యాగ్ చేశారు. ఈ పిల్లల ఆలోచనను, కృషిని అభినందిస్తూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.
హైదరాబాద్ నిజాంపేట్కు చెందిన రాంబాబు సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆయన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటాడు. తండ్రి చూపిన బాటలోనే నడుస్తున్నారు ఆయన పిల్లలు పదకొండేండ్ల దిశిత, ఏడేండ్ల సహర్ష్. మొక్కల పెంపకంపై ఆసక్తిని పెంచుకున్నారు. పరిసరాలన్నీ పచ్చని చెట్లతో కళకళలాడితే ఎంత బాగుంటుందో అనుకున్నారు. గత వేసవిలో పిల్లలిద్దరికీ ఓ ఆలోచన వచ్చింది. వర్షాకాలంలో మొక్కలు నాటడానికి ఇంట్లోనే మామిడి మొక్కలను సిద్ధం చేశారు. ఇద్దరూ కలిసి యూట్యూబ్లో జర్మినేషన్ పద్ధతి గురించి తెలుసుకున్నారు. మామిడి పిక్కలను బాగా ఎండబెట్టి, తర్వాత అందులోని జీడిలను బయటకు తీశారు. ఒక్కో జీడినీ ఒక్కో టిష్యూపేపర్లో చుట్టి నీళ్లు చల్లారు. నాలుగైదు రోజుల్లో ఆ జీడిలు చిగురించాయి. వాటిని భద్రంగా నాటి మొక్కలుగా పెంచారు. నర్సరీలో పెంచినట్లు దాదాపు 200 మామిడి మొక్కలను సిద్ధం చేశారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈ చిన్నారులు సృష్టించిన మొక్కలను ప్రభుత్వం చేపడుతున్న హరితహారంలో భాగంగా పంచాలనుకుంటున్నారు. ఇదే విషయాన్ని పిల్లల తండ్రి రాంబాబు ట్విట్టర్లో పోస్ట్ చేయగా మంత్రి కేటీఆర్తోపాటు పలువురు ప్రశంసల వర్షం కురిపించారు.
“మన హైదరాబాద్లాంటి మహానగరాల్లో రోజురోజుకూ కాలుష్యం బాగా పెరుగుతున్నది. దాంతో స్వచ్ఛమైన గాలి దొరకడమే కష్టంగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, మేం పెద్దయ్యాక వాతావరణం ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. అందుకే ఎక్కువ మొక్కలు నాటితే, వర్షాలు బాగా పడతాయి. పర్యావరణమూ బాగుపడుతుంది. అందుకే మొక్కలు పెంచాలని నిర్ణయించుకున్నాం. మా ప్రయత్నం గురించి తెలిసిన అమ్మానాన్న ఎంతో సంతోషించారు. మాకు కావాల్సిన టిష్యూ పేపర్లు, మట్టి, గ్లాసులు, కుండీలు అన్నీ సమకూర్చారు. పల్లెల్లోలాగానే మన నగరాల్లోనూ ఆక్సిజన్ స్థాయిలు పెరగాలని, అందరికీ చల్లని నీడ దొరకాలని కోరుకుంటున్నామ”ని చెప్పుకొచ్చారు ఈ చిన్నారి పర్యావరణవేత్తలు.