సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): మూసీ మెరిసిపోతోంది. ఒకప్పుడు దుర్వాసనకు మారుపేరైన ఈ నది.. నేడు అందాలకు నిండైన కేంద్రంగా మారుతోంది. గండిపేట వద్ద నగరంలోకి ప్రవేశించే మూసీ గౌరెల్లి వరకు సుమారు 55 కిలోమీటర్లు ప్రవహిస్తుండగా ప్రభుత్వం సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పెరుగుతున్న రద్దీతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మూసీపై 15 చోట్ల బ్రిడ్జిలను నిర్మించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. ఇందుకోసం సుమారు రూ.392 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ బ్రిడ్జిలను జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏలు కలిసి నిర్మించనున్నాయి. దీంతో నిర్ణీత సమయంలో నిర్ణయించిన ప్రాంతాల్లో మూసీపై నూతన వంతెనలు ఏర్పాటు కానున్నాయి.
మూసీకి ఇరువైపులా నగరం శరవేగంగా విస్తరిస్తుండటంతో నివాస, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్నాయి. అయితే ఒక ప్రాంతం నుంచి నదికి అవతల వైపు ఉన్న మరో ప్రాంతానికి వెళ్లాలంటే మాత్రం నగరవాసులు అనేక వ్యయ ప్రయాసలు పడుతున్నారు. దిల్సుఖ్నగర్ నుంచి అంబర్పేట వైపు రావాలంటే నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన మూసారం బాగ్, నాగోల్ వద్ద ఇన్నర్ రింగ్రోడ్డుపై నిర్మించిన వంతెనే దిక్కు. ఈ రెండు ప్రాంతాల మధ్య ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక్క బ్రిడ్జి కూడా లేదు. దీంతో ఈ ప్రాంతాల ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్లోనూ ఇదే పరిస్థితి. గండిపేట నుంచి లంగర్హౌస్, హిమాయత్సాగర్ నుంచి లంగర్హౌస్ వరకు ఉన్న ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల మార్గంలో అవసరమైన చోట్ల వంతెనలు లేవు. దీంతో మూసీ దాటాలంటే చుట్టూ తిరిగి రావాల్సిందే. ప్రతి రోజు సమయం, ఇంధనం వృథా అవుతుండటంతో పాటు వాయు కాలుష్యం పెరుగుతోందని పర్యావరణ వేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మూసీపై ఒకేసారి 15 వంతెనలను నిర్మించనున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో మూసీ నిర్లక్ష్యానికి గురైంది. ఫలితంగా వరద నీరు పారాల్సిన నదిలో మురుగు పారుతోంది. పైగా తీరప్రాంతమంతా కబ్జాలకు గురైంది. నూతన రాష్ట్రంలో మూసీకి ప్రభుత్వం మహర్దశ తీసుకువస్తున్నది. ఇప్పటికే మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి సుందరీకరణ పనులు చేపట్టింది. తాజాగా మూసీకి ఇరువైపులా మెరుగైన రోడ్ నెట్వర్క్ను రూపొందించే పనిలో పడింది. కొత్తగా ఒకే సారి 15 వంతెనలను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు డీపీఆర్లను సిద్ధం చేసిన అధికారులు త్వరలోనే టెండర్లు పిలిచి ఏడాదిన్నర లోపు నిర్మాణ పనులను పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నారు.