కార్పొరేషన్, జూలై 7 : కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జి పనుల్లో వేగం పెంచి సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అరవింద్కుమార్ సూచించారు. బుధవారం కరీంనగర్-సదాశివపల్లి మానేరుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. బుల్ సెమన్ సెంటర్లో నాటిన మియావాకి ప్లాంటేషన్ను పరిశీలించారు. జ్యోతిబాఫూలే పార్కును సందర్శించి వాటిలో జరుగుతున్న పనులతో పాటు, బస్బేలను పరిశీలించారు.
అనంతరం కలెక్టరేట్ రోడ్లో నిర్మించిన స్మార్ట్సిటీ రోడ్డు, స్మార్ట్ టాయిలెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్కే మణిహారంగా కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందన్నారు. బ్రిడ్జి నిర్మాణ పను ల ప్రగతి వివరాలను నిర్మాణ ఏజెన్సీని అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని ఏజెన్సీని ఆదేశించారు. నగర శివారులోని డంపింగ్యార్డును ప్రక్షాళన చేసేందుకు త్వరగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులన్నింటిని వేగంగా పూర్తి చే యాలన్నారు. ముఖ్యంగా పార్కులను సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. హరితహారం 7వ విడతలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి కరీంనగర్ను హరితవనంగా మార్చాలని పేర్కొన్నారు.
సీఎన్సీలో డంపింగ్యార్డుకు సంబంధించిన ఫైల్ను రెండు రోజుల్లో క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. నగరంలో అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని, మరింత సుందరీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం చింతకుంటలో యాదాద్రి మోడల్లో ఏర్పాటు చేసిన బృహత్ పట్టణ ప్రకృతి వనాన్ని సందర్శించి మొకలు నాటారు. అనంతరం పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు జగిత్యాల జిల్లాలో పట్టణ ప్రగతి, మున్సిపల్ చట్టం అమలుపై సమీక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, నగర మేయర్ సునీల్ రావు, నగర పాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్, నగరపాలక సంస్థ ఎస్ఈ కృష్ణారావు, ఈఈ రామన్ తదితరులు పాల్గొన్నారు.