ప్రజల సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలి
పౌరుల రక్షణ, పరిపాలనా సౌలభ్యం కోసమే చట్టాలు
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య
జిల్లాలోని వివిధ శాఖల్లో పెండింగ్ కేసులపై సమీక్ష
మామిళ్లగూడెం, జూన్ 30: ప్రజల హక్కులకు భంగం కలుగకుండా వారికి న్యాయం చేకూర్చేలా అధికారులు తమ బాధ్యతలను చట్టబద్ధంగా నిర్వర్తించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జీ.చంద్రయ్య సూచించారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన.. సాయంత్రం టీటీడీసీ సమావేశ మందిరంలో కమిషన్ సభ్యులు ఆనందరావు, మహ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ విష్ణు ఎస్ వారియర్లతో కలిసి జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల పనితీరు, పెండింగ్ కేసుల పరిష్కార స్వభావం, ప్రభుత్వ అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాల లబ్ధి తదితర అంశాలపై సమీక్షించి జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ పౌరుల రక్షణ కోసం, పరిపాలన సౌలభ్యం కోసమే చట్టాలు రూపొందాయన్నారు. వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, పోలీసు అధికారులు సహనం, ఓర్పు కలిగి ఉండాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల లబ్ధి ప్రజలకు అందుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సేవలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని, శాంతి భద్రతల పరిరక్షణలో సీపీ ఆధ్వర్యంలో పోలీసు అధికారుల పనితీరు బాగుందని అన్నారు. స్టేషన్ హౌజ్ అధికారులు, కింది స్థాయి పోలీసు సిబ్బంది సమన్వయం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. రెవెన్యూ, పోలీసు, నగరపాలక సంస్థ, ఇతర శాఖల్లో మానవ హక్కుల కమిషన్కు సంబంధించిన పెండింగ్ కేసులపై సత్వరమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. అదనపు సీపీ సుభాశ్ చంద్రబోస్, కేఎంసీ కమిషనర్ అనురాగ్జయంతి, అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఆర్వో శిరీష, డీఎఫ్వో ప్రవీణ, డీఎంహెచ్వో మాలతి, డిప్యూటీ సీఈవో శ్రీరామ్, బీసీ సంక్షేమాధికారి జ్యోతి, ఎస్సీ అభివృద్ధిశాఖ డీడీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.