వెల్దుర్తి, జూన్ 18 : మారుమూల పల్లెలను సైతం అభివృద్ధ్దిలో అగ్రగామిగా నిలవాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లెప్రగతితో మండలంలోని రామంతాపూర్ గ్రామం కొత్త రూపు సంతరించుకున్నది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, గ్రామ పంచాయతీ ప్రత్యేక నిధులను సద్వినియోగం చేసుకుంటూ, దాతల సహకారంతో రామంతాపూర్ గ్రామం అభివృద్ధి వైపు దూసుపోతున్నది. రామంతాపూర్, మధిర గ్రామమైన లింగారెడ్డిపల్లిలో కలిపి 210 నివాస గృహాలు, 871 జనాభా, 644 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామం మండలంతో పాటు నర్సాపూర్ నియోజకవర్గానికి ఈశాన్యంలో ఉంటుంది. పల్లెప్రగతిలో భాగంగా 9 శిథిలమైన ఇండ్లు, రెండు పాడుబడిన బావులు, రెండు పెంటకుప్పలను పూడ్చి చదును చేశారు. ఖాళీ స్థలాల్లో, మురుగు కాల్వల వెంబడి పిచ్చిమొక్కలు, ముళ్లపొదలను ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు శ్రమదానంతో వాటిని తొలిగించి శుభ్రం చేశారు. గ్రామంలో పలు వీధు ల్లో సీసీరోడ్లను నిర్మించడంతో పాటు అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లెప్రకృతి వనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. 10 వేల మొక్కల సామర్థ్యం గల పల్లె నర్సరీని ఏర్పాటు చేసి పూలు, పండ్లు, నీడనిచ్చే, అటవి జాతితో పాటు ఎన్నో రకాల మిశ్రమ జాతి మొక్కలను పెంచుతున్నారు. పలు వీధుల్లో మొక్కలను నాటి ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు.
దాతల సహకారంతో..
గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పలు పరిశ్రమలు, దాతల సహకారంతో జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి వెళ్లే అన్ని వీధుల్లో 16 సీసీ కెమెరాలు, మధిర గ్రామం లింగారెడ్డిపల్లిలో నాలుగు సీసీ కెమెరాలు మరో రూ.2.50 లక్షల విలువ చేసే సీసీ కెమెరాలను దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. రూ.1.50 లక్షల విలువ గల తాగునీటి మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి, నిర్వహణ బాధ్యతను నిరుద్యోగ యువకుడికి అప్పగించారు. యువకుడికి ఉపాధితో పాటు పం చాయతీకి నిధులు సమకూరుతున్నాయి.
గ్రామీణాభివృద్ధి శిక్షణకు వచ్చిన అధికారులు..
శిక్షణలో ఉన్న నలుగురు సివిల్ సర్వీసెస్ అధికారులు గత మార్చిలో గ్రామీణాభివృద్ధి శిక్షణలో భాగంగా రామంతాపూర్లో వారం రోజుల పాటు ఉండి తమ క్షేత్రస్థాయి పర్యటన, శిక్షణను పూర్తి చేశారు. ఇందులో దీక్ష(అస్సాం, ఐసీఏఎస్), సుస్మిత (తమిళనాడు, ఐసీఎల్ఎస్), రవిప్రసాద్ (గుజరాత్, ఐఎఫ్ఎస్), అంకిత్కుమార్సింగ్ (హిమాచల్ప్రదేశ్, ఐఎఫ్ఎస్) వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన వారు గ్రామంలో పర్యటించి ప్రభు త్వ పథకాలు, వాటి అమలు, పంచాయతీల నిర్వహణ, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన మా ర్పులు, ఇతర పథకాల అమలు వంటి వాటి పై అధ్యయనం చేసి నివేదికలను రూపొందించారు.