నేడు సంగమేశ్వర ఎత్తిపోతల సర్వేకు శ్రీకారం
లింగంపల్లిలో ప్రారంభించనున్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు
సంగారెడ్డి,జహీరాబాద్, అందోలు సెగ్మెంట్లలో 2.19 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు
రెండు నెలల్లో డీపీఆర్ సిద్ధం
త్వరలో సంగారెడ్డి జిల్ల్లాకు గోదావరి జలాలు
సంగారెడ్డి, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా రైతులకు నేడు శుభదినం. గోదావరి జలాలు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు తొలి అడుగు పడనుంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్రావు సర్వే పనులను నేడు ప్రారంభించనున్నారు. మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలో సోమవారం ఉదయం 11గంటలకు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వేను ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం పూర్తి చేసింది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు నియోజకవర్గాల్లోని పంటపొలాలకు గోదావరి జలాలు అందనున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. సంగమేశ్వర ఎత్తిపోతలతో జిల్లాలో సాగు ముఖచిత్రం మారనుంది. రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
మూడు సెగ్మెంట్లు.. లక్షల ఎకరాలు…
సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా జహీరాబాద్ నియోజకవర్గంలో 1,05,950 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. సంగారెడ్డి నియోజకవర్గం లో 56,193 ఎకరాలు, అందోలు నియోజకవర్గంలో 56, 857 ఎకరా ల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. సంగమేశ్వర ఎత్తిపోతల ప థకం నిర్మాణానికి రూ.4500కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. సర్వే పనులు ప్రారంభించిన అనంతరం రెండు నెలల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) అందజేయాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సర్వే సంస్థలను ఆదేశించారు. సర్వే ప్రారంభించిన రెండు నెల ల్లో డీపీఆర్ అందజేసేందుకు సర్వే సంస్థ సన్నద్ధమవుతున్నది. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనుల విషయమై మంత్రి హరీశ్రావు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు, సర్వే సంస్థలతో మాట్లాడుతూ సర్వే త్వరగా ముగిసేలా చర్యలు తీసుకుంటున్నారు.
నెరవేరనున్న రైతుల కల…
సంగారెడ్డి ప్రాంత రైతులు సాగునీటి కోసం ఏండ్లుగా కలలు కంటున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఏకైక సాగునీటి ప్రాజెక్టు సిం గూరు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. మిగతా ప్రాంతాలకు సైతం సాగునీరు అందజేయాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ ద్వారా సింగూరు ప్రాజెక్టులోకి గో దావరి జలాలను తరలించి, అక్కడి పంటపొలాలకు సాగునీరు ఇవ్వాలని సంకల్పించారు. ఇందులో భాగంగా సింగూరు ప్రా జెక్టు ఎగువభాగంలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రెండు పథకాల ఏర్పాటు కోసం అవసరమైన సర్వే, డీపీఆర్లు సిద్ధ్దం చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పను లు చేపట్టేందుకు టెండర్లు ఆహ్వానించారు. టెండర్లలో సంగమేశ్వర ఎత్తిపోతల సర్వే పనులను సాయిగణేశ్ అసోసియేట్స్ సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ సర్వే పనులు జరిపి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) ప్రభుత్వానికి అందజేయనుంది.
సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా జహీరాబాద్ నియోజకవర్గంలో హద్నూర్, జహీరాబాద్, గోవిందాపూర్ కెనాల్ ద్వారా కోహీర్, ఝరాసంగం, జహీరాబాద్, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాల్లోని 1.05 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. అందోలు నియోజకవర్గంలోని రాయికోడ్, మునిపల్లి మండలాల్లో హద్నూర్, కంది కాల్వల ద్వారా 56,857 ఎకరాలకు సాగునీరు అందనుంది. సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట, కొండాపూర్, సంగారెడ్డి, కంది మం డలాల్లోని 56,193 ఎకరాలకు కంది కాల్వల ద్వారా సాగునీరు అందనుంది. సంగమేశ్వర ఎత్తిపోతల నిర్మాణంలో భాగంగా సింగూరు ప్రాజెక్టు బ్యాక్వాటర్ నుంచి 15 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. ఇందుకోసం హద్నూర్, హోతికుర్డులో 2 చోట్ల పంప్హౌస్లు నిర్మించనున్నారు. జహీరాబాద్, అందోలు, సం గారెడ్డి నియోజకవర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు హద్నూర్, జహీరాబాద్, గోవిందాపూర్, కంది కెనాళ్లు నిర్మించనున్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా 188.3 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వలు, 383.7 కిలోమీటర్ల మేర డిస్ట్ట్రిబ్యూటరీ కెనాళ్లు నిర్మిస్తారు. 386.6 కిలోమీటర్ల మేర మైనర్ కాల్వలను నిర్మించనున్నారు.