హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం భూములను వేలం వేయడాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు నిధుల సమీకరణకు అవసరమైన సూచనలు ఇవ్వడంలో మాత్రం విఫలమవుతున్నాయి. కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సైతం గణనీయంగా తగ్గింది. మరోవైపు ఖర్చు భారీగా పెరిగింది. ఓవైపు ప్రజా సంక్షేమ పథకాలు, మరోవైపు ప్రాజెక్టులను పూర్తి చేయాలి. డబ్బు లేదని పనులు నిలిపేస్తే ఇన్నాళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఇవన్నీ చేయాలంటే డబ్బు కావాలి. ఎంత అడిగినా కేంద్రం ఆదుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏం చేయాలి? నిధుల సమీకరణకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషించాలి.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదే చేస్తున్నది.
కేంద్రం చూపిన బాటలోనే..
కరోనాతో నష్టపోయిన తమను ఆదుకోవాలని తెలంగాణ సహా అన్ని రాష్ర్టాలు కేంద్రాన్ని కోరాయి. అయినా పట్టించుకోని కేంద్రం జీఎస్టీ పరిహారాన్ని సైతం పూర్తిగా లెక్కించకుండా కొంత మొత్తంతో మమ అనిపించింది. ఈ గండం గట్టెక్కాలంటే ‘హెలికాప్టర్ మనీ’ (నోట్ల ముద్రణ) ఒక్కటే మార్గమని సీఎం కేసీఆర్ కేంద్రానికి సూచించారు. దానినీ పట్టించుకోలేదు. మరి కేంద్రం ఇవ్వకపోతే రాష్ర్టానికి నిధులు ఎక్కడినుంచి వస్తాయి? ఇలాంటి సమయంలో ప్రభుత్వాలకు ఉండే ఏకైక మార్గం పన్నులు పెంచడం. ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోరు. ఆయన ఢిల్లీ నుంచి దిగుమతి కాలేదు.. ప్రజల నుంచి వచ్చిన మనిషి. ప్రజా సంక్షేమం కోసం తపించే నాయకుడు. అందుకే.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగటం కోసం నిరుపయోగంగా ఉన్న భూములను విక్రయించాలని నిర్ణయించారు. కేంద్రప్రభుత్వం సైతం నిధుల సమీకరణకు పీఎస్యూలను అమ్మేస్తున్నది. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం గురివింద గింజల్లా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా భూముల వేలం నిర్వహిస్తున్నది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్టీసీని నోడల్ ఏజెన్సీగా నియమించింది. భూముల గుర్తింపు మొదలు కొనుగోలుదారుల చేతికి పట్టా, వారికి భూమి అందేవరకు ప్రతి దశలో పటిష్ఠమైన విధివిధానాలు రూపొందించింది. ఓపెన్ బిడ్డింగ్కు పిలువడం, పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం.. ఇలా ప్రతి దశలోనూ పారదర్శకంగా సాగేలా చర్యలు చేపట్టింది. ఈ నిధులను ప్రభుత్వం తిరిగి ప్రజా సంక్షేమానికే ఖర్చు చేస్తుంది కదా. అత్యవసరంగా రాష్ట్రవ్యాప్తంగా వైద్య సదుపాయాలను పెంచాల్సి ఉంటుంది. ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేస్తుంది.
పెరిగిన ఖర్చు
మొదటి, రెండో వేవ్ సమయంలో లాక్డౌన్ విధించినప్పుడు ప్రభుత్వం అనేక రూపాల్లో ప్రజలను ఆదుకున్నది. పేదలు, వలసకార్మికులు ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో ఉచితంగా బియ్యాన్ని, నగదుసాయాన్ని అందజేసింది. కరోనా బాధితులకు ఉచితంగా వైద్యం అందించింది. విలువైన ఔషధాలను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచింది. దవాఖానల సామర్థ్యం పెంచేందుకు అవసరమైన పరికరాలను, వెంటిలేటర్లను కొనుగోలుచేసింది. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన అనేకవర్గాల వారికి రాయితీలు ప్రకటించి ఆదుకున్నది. సెకండ్వేవ్ నాటికి దవాఖానల్లో మౌలిక వసతులను గణనీయంగా పెంచింది. ప్రభుత్వ దవాఖానలకు ఎంతమంది వచ్చినా ఉచితంగా వైద్యం అందించింది. మరోవైపు ప్రైవేట్ ఉపాధ్యాయుల కుటుంబాలకు నెలకు రూ.2వేలు, ఉచితంగా బియ్యం ఇస్తూ ఆదుకుంటున్నది. ఆసరా పెన్షన్లు వంటి సంక్షేమ పథకాలకు ఎక్కడా ఆటంకం రాకుండా చూసుకున్నది. అందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేసే విపక్షాలకు.. వీటన్నింటికీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందన్న సోయి లేకుండా పోయింది.