వాషింగ్టన్: ప్రపంచ దేశాల కోసం అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వం 50 కోట్ల ఫైజర్-బయోఎన్టెక్ కరోనా వ్యాక్సిన్లను కొనుగోలు చేయనున్నట్లు అక్కడి మీడియా బుధవారం వెల్లడించింది. దీనికి సంబంధించి జీ7 సమావేశంలో బైడెన్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ పత్రికలు తెలిపాయి. ధనిక దేశాలే మెజార్టీ వ్యాక్సిన్లను కొనుగోలు చేశాయన్న ఆరోపణల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కూడా తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటోంది.
అమెరికా ఇప్పటికే తన సగానికి పైగా జనాభాకు వ్యాక్సిన్లు వేసేసింది. అక్కడి కరోనా కేసులు కూడా భారీగా తగ్గాయి. బ్రిటన్కు వెళ్లడానికి ఎయిర్ఫోర్స్ వన్ ఎక్కే ముందే దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు బైడెన్ హింట్ ఇచ్చారు. ప్రపంచం కోసం వ్యాక్సిన్ వ్యూహం ఏమైనా ఉందా అని ప్రశ్నించగా.. నా దగ్గర ఒక వ్యూహం ఉంది. త్వరలోనే ప్రకటిస్తాను అని ఆయన అన్నారు. ఈ ప్రకటన చేసే సమయంలో బైడెన్తోపాటు ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా కూడా ఉండే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్ల కోసం లాభాలు లేని ధరను ఫైజర్కు అమెరికా చెల్లించనుంది. వీటిలో 20 కోట్లను ఈ ఏడాది, 30 కోట్లను వచ్చే ఏడాది ప్రపంచ దేశాలకు పంపిణీ చేయనుంది.