దేశవ్యాప్తంగా ప్రముఖులు మొదలుకొని సామాన్య ప్రజల వరకు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో డబ్బులున్నా సరైన వైద్య సదుపాయాలు అందని, దవాఖానల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. వివిధ రకాల మందులు, ఇంజిక్షన్లు కొనుక్కోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో తనకు ట్విట్టర్లో తెలియజేస్తే అన్నిరకాల సదుపాయాలు కలుగుతాయనే నమ్మకాన్ని కేటీఆర్ నిరుపేదలకు కల్పించగలిగారు.
తనకు కరోనా సోకి ఐసొలేషన్లో ఉండి ఆరోగ్యం సహకరించకున్నా ఎప్పటికప్పుడు ట్విట్టర్లో ప్రజలకు అందుబాటులో ఉన్నారు కేటీఆర్. విజ్ఞప్తి చేసిన వారికి తన సిబ్బంది సహకారంతో వైద్య సదుపాయం అందిస్తున్నారు. దవాఖానల్లో పడకలు, మందులు, ఆక్సిజన్ సిలిండర్ మొదలైనవి ఏర్పాటుచేయిస్తున్నారు. మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న విజ్ఞప్తులను స్వీకరిస్తూ, అయా ప్రభుత్వాలతో తనకున్న వ్యక్తిగత సంబంధాల ద్వారా వారి సమస్యలను కూడా తీరుస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 2, 3 గంటల సమయంలో కూడా తనకు ట్విట్టర్లో వచ్చిన విజ్ఞప్తులకు స్పందిస్తూ వైద్య సదుపాయాలను కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా ఈ మధ్య జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తున్నది. బేగంపేట బస్తీలో గోకుల కృష్ణారావు- సరిత దంపతులు కొంతకాలంగా నివసిస్తున్నారు. కృష్ణారావు ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్. లాక్డౌన్ కారణంగా స్కూల్ మూతపడటంతో ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడు. ఐదు నెలలుగా ఇంటి అద్దె చెల్లించడం లేదు. ఆ ఇంటి యజమాని ఈ నెల 13న బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాడు. చేతిలో చిల్లిగవ్వ లేక బాధపడుతూ తమ ఇంటి సామానుతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో కల్వర్ట్ దగ్గర కృష్ణారావు దంపతులు తలదాచుకున్నారు. ఆ సమయంలో రోడ్డు పక్కన వెళ్తున్న ఒక యువకుడు వారి దీనస్థితిని చూసి గాంధీనగర్ పరిధిలోని పతేధారు భవన్లో తాత్కాలిక వసతి కల్పించి, వారి దీనస్థితిని వీడియో, ఫొటోలు తీసి కేటీఆర్కు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దీనికి తక్షణమే స్పందించిన కేటీఆర్ వారికి ఏదైనా ఉపాధి అవకాశం కల్పించాలని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ను కోరారు. సీపీ ఉత్తర మండలం డీసీపీ సహకారంతో బేగంపేట ఎయిర్పోర్ట్ పక్కన పనులు జరుగుతున్న కార్గో నిర్మాణ సంస్థలో కృష్ణారావుకు 16 వేల వేతనంతో డ్రైవర్ ఉద్యోగం, అతని భార్య సరితకు 10 వేల వేతనంతో స్వీపర్ ఉద్యోగం ఇప్పించారు. ఉపాధి లేక చేతిలో చిల్లిగవ్వ లేక ఇల్లు ఖాళీ చేయవలసి రావడంతో ఒక దశలో వారు ఆత్మహత్యే శరణ్యమని భావించారు. అలాంటి తమకు కేటీఆర్ అండగా ఉండి ఉపాధి కల్పించారని, కేటీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని కృష్ణారావు, సరిత దంపతులు అంటున్నారు.
కేటీఆర్ నుంచి సహా యం పొందినవా రు ‘మేము మీకు చేసిన విజ్ఞప్తి వల్ల మాకు సహాయం అందింది, మా బంధువులు, కుటుంబ సభ్యులు కరోనా వైరస్ నుంచి కోలుకొని ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అని పోస్టులు పెడుతున్నారు. కేటీఆర్ మూలంగా తమకు అందిన మందులను, ఆక్సిజన్ సిలిండర్ను చూపి స్తూ పోస్టులు పెడుతున్నారు. దీనికి స్పందిస్తున్న కేటీఆర్ మీ వాళ్లు త్వరగా కోలుకోవాలని, ఆకాంక్షిస్తూ వారికి మనోధైర్యం చెబుతున్నారు.
తెలంగాణలో ఏమూల, ఎవరికి ఏ ఆపద వచ్చినా సామాజిక మాధ్యమాల ద్వారా ఓ చిన్న సమాచారం అందినా వెంటనే స్పందించటం కేటీఆర్ ప్రత్యేకత. ఇలాంటి స్పందనతో ఇప్పటికే ఎంతోమందికి సాయం అందించారు. మరెంతో మంది ప్రాణాపాయ పరిస్థితుల నుంచి గట్టెక్కారు. కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయి అనాథలా రోడ్డున పడ్డవారిని కూడా కేటీఆర్ ఎన్నోవిధాలా ఆదుకున్నారు. జీవనోపాధిని పొందేలా చూశారు. ఇలాంటి ఉదాహరణలను ఎన్నయినా చెప్పుకోవచ్చు. అందుకు సాయం పొందిన వారి మనోగతాలనే చెప్పుకోవచ్చు.
ఎప్పుడైనా సోషల్ మీడియాలో సినిమా, క్రీడారంగాలకు చెందిన సెలబ్రిటీలకు మాత్రమే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండటం చూస్తుంటాం. కానీ ఒక రాజకీయ నాయకుడికి ట్విట్టర్లో దాదాపు 30 లక్షల ఫాలోవర్స్ ఉండటం అరుదు. తమ విజ్ఞప్తులకు స్పందించే తీరును బట్టి ప్రజలు, యువత ఆ రాజకీయ నాయకుని ట్విట్టర్ను ఫాలో కావడం జరుగుతుంది. ఈ తరహా నాయకులు దేశంలో అతి కొద్ది మంది ఉంటారు.
‘మీ ట్విట్టర్ స్పందన చూసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.. మీరు చేస్తున్న సహాయం దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరికీ ఆదర్శంగా ఉంది’ అని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్రాజు లాంటి వారు తన ట్విట్టర్ ఖాతాలో కేటీఆర్ను అభినందించటం ముదావహం. మిమ్మల్ని చూసి ఇతర నాయకులు కూడా ఈ ఆపద సమయంలో ప్రజలను ఇదేవిధంగా ఆదుకోవాలని అభిప్రాయపడ్డారు. ఆపద సమయంలో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఆదుకునే నాయకులను ప్రజలు ఎప్పటికీ తమ గుండెల్లో దాచుకుంటారు. అలాంటి అతి కొద్దిమంది నాయకుల్లో కేటీఆర్ ఒకరు.
‘మా నాన్నగారు లంగ్ ఇన్ఫెక్షన్ కారణంగా దవాఖానలో ఐసీయూలో ఉన్నారు. లంగ్స్ 80 శాతం వరకు డ్యామేజ్ అయ్యాయి. డాక్టర్లు 4 రెమ్డెసివిర్ ఇంజక్షన్లు కావాలన్నారు. ఏ ఫార్మసీలో దొరకటం లేదు. దయచేసి మీరు సాయం చేయండి..’- అనిల్కుమార్ అనే వ్యక్తి ట్వీట్
‘రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అందాయి సర్. మీ సహాయానికి ధన్యవాదాలు..’- అనిల్కుమార్ మరో ట్వీట్
‘మా మామయ్యకు కరోనా వచ్చింది. హైదరాబాద్ అలకాపురి ఎక్స్ రోడ్లోని దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆక్సిజన్ స్థాయి 87కి పడిపోయింది. ఆక్సిజన్ సపోర్ట్ కావాలని వైద్యులు చెప్పారు. రోజంతా ప్రయత్నించినా ఫలితం లేదు. దయచేసి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఏర్పాటు చేయండి..’
‘మీకు ట్వీట్ చేసిన మూడు గంటల్లోనే కాన్సన్
ట్రేటర్ అందింది. సరైన వ్యక్తి చేతిలో అధికారంతోపాటు గొప్ప హృదయం ఉన్న వ్యక్తిని మేము చూస్తున్నాము. కృతజ్ఞతలు సర్..’
కిషోర్ గౌడ్