న్యూఢిల్లీ : కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గతంలో 8 వారాలుగా ఉన్న విరామాన్ని 12 నుంచి 16 వారాలకు పొడిగించడం పట్ల విమర్శలు వెల్లువెత్తడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కొవ్యాక్సిన్ డోసేజ్ లో ఎలాంటి మార్పులు లేకుండా కొవిషీల్డ్ డోసేజ్ లో మార్పుల పట్ల ఐసీఎంఆర్ వివరణ ఇచ్చింది. ఈ నిర్ణయం పట్ల నెలకొన్న అనిశ్చితికి ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరాం భార్గవ తెరదించారు. ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే కొవ్యాక్సిన్ తొలి డోసుతో వచ్చే ఇమ్యూనిటీ అధికంగా లేనందున రెండు డోసుల మధ్య విరామాన్ని పెంచలేదని స్పష్టం చేశారు.
సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసే కొవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసుతో ఇమ్యూనిటీ అధికంగా ఉండటంతో రెండు డోసుల మధ్య కేంద్రం ప్రకటించిన మూడు నెలల గ్యాప్ ను భార్గవ సమర్థించారు. కొవ్యాక్సిన్ తొలి డోసుతో ఇమ్యూనిటీ ఇతర వ్యాక్సిన్ల స్థాయిలో లేనందున నాలుగు వారాల గ్యాప్ తో రెండవ డోసు తీసుకుంటే పూర్తి స్థాయి రోగనిరోధకశక్తి లభిస్తుందని అన్నారు. కొవిషీల్డ్ తొలిడోస్ తోనే యాంటీబాడీలు మెరుగ్గా తయారవుతున్నాయని చెప్పారు.