హైదరాబాద్ : పదో తరగతి మార్కుల లెక్కింపు, బోర్డుకు సమర్పించే గడువును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మంగళవారం పొడిగించింది. గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. జూన్ 11 నాటికి మార్కుల లెక్కింపు పూర్తి అవుతదని, జూన్ 20 నాటికి ఫలితాలను ప్రకటిస్తామని సీబీఎస్ఈ అంతకుక్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కొవిడ్-19 మహమ్మారి ఉధృతి నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ విధింపు అదేవిధంగా ఉపాధ్యాయులు, సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు.
దేశంలోని కొవిడ్-19 మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రద్దు చేసిన 10వ తరగతి పరీక్షలకు మార్కుల జాబితా కోసం సీబీఎస్ఈ ఈ నెల ప్రారంభంలో ఒక విధానాన్ని ప్రకటించింది. ఈ పాలసీ ప్రకారం ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా ప్రతీ సబ్జెక్టుకు 20 మార్కులు అదేవిధంగా ఏడాది పొడవునా వివిధ పరీక్షలలో విద్యార్థుల పనితీరు ఆధారంగా 80 మార్కులు లెక్కించబడతాయంది.