మెదక్ మున్సిపాలిటీ/ పటాన్చెరు, మే 13 : దేశవ్యాప్తంగా గురువారం నెలవంక చంద్రుడు కనిపించడంతో రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు నిర్వహించుకోనున్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్లో నెల రోజుల ఉపవాసాలు (రోజా)లు ఉంటారు. ఉపవాస దీక్షల అనంతరం నిర్వహించుకొనే పండుగ ఈద్-ఉల్-ఫితర్. రంజాన్ను అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకునేందుకు ముస్లింలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పవిత్రమైన శుక్రవారం రంజాన్ రావడంతో ముస్లింలలో సంతోషం నెలకొన్నది. ఈద్ నమాజ్లు ఎక్కువగా ఈద్గాల్లో నిర్వహిస్తారు. ప్రతి చోట ఈద్గాలకు వెళ్లి ప్రార్థనలు చేసి నమాజ్లు చేస్తారు. నమాజ్కు బయలుదేరే సమయంలో జకాత్లు చెల్లిస్తారు. వాటితో పాటు ఫిత్ర దానాలు చేస్తారు. నమాజ్ల సందర్భంగా ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి అల్లా సర్వమానవాళికి ఆశీస్సులు అందజేయాలని, అందరి ఆయురారోగ్యాలను కాపాడాలని కోరుకుంటారు. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రార్థిస్తారు. ఈద్ నమాజ్ల అనంతరం తమ పూర్వీకుల సమాధులను సందర్శించి నివాళులర్పిస్తారు. ఈ సారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రంజాన్ ప్రార్థనలు ఇండ్లకు పరిమితం చేసేందుకు ముస్లిం మతపెద్దలు పిలుపు ఇచ్చారు. ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు వద్దని సూచించారు.
ప్రముఖుల శుభాకాంక్షలు..
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నాశనం కావాలని అల్లాను ప్రార్థించాలని కోరారు. ముస్లింలు రంజాన్ను ఇండ్లలోనే నిర్వహింప్చకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
సామూహిక ప్రార్థనలు లేవు..
ఈద్-ఉల్-ఫితర్ను నేడు జిల్లా వ్యాప్తంగా నిరాడంబరంగా చేసుకోనున్నారు. పరస్పర ప్రేమ, శాంతి, సహనాన్ని ప్రబోధించిన రోజుగా రంజాన్ను చేసుకోనున్నారు. గత నెల ఏప్రిల్ 14వ తేది నుంచి రంజాన్ మాసం ప్రారంభం కాగా గురువారంతో ముగిసింది. ‘ఈద్-ఉల్-ఫితర్’ ను దానధర్మాల పండుగగా భావిస్తారు. పేద, ధనిక వ్యత్యాసం లేకుండా కుటుంబ సభ్యులందరి తరఫున ఫిత్రా చెల్లిస్తారు. కరోనా నేపథ్యంలో మసీదులు, ఈద్గాలో సామూహిక ప్రార్థనలు నిర్వహించకూడదన్నారు.