కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో రియల్ ఎస్టేట్ రంగంలోని నిర్మాణ రంగానికి వెసులుబాటును కల్పించింది. భవన నిర్మాణాలతో పాటు రోడ్లు, బ్రిడ్జిలు వంటి నిర్మాణ ప్రాజెక్టుల్లో పనులు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. మంగళవారం రాత్రి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన లాక్డౌన్ మార్గదర్శకాల్లో అనుమతించిన కార్యకలాపాల్లో 20వ అంశంగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా సూచన చేసింది. ఇందులో నిర్మాణ రంగం, ప్రాజెక్టుల కార్యకలాపాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఆయా ప్రాజెక్టులు, నిర్మాణాలు జరిగే చోట కార్మికులు అందుబాటులో ఉండాలి. పెద్ద ప్రాజెక్టులు అయితే కార్మికులకు అక్కడే క్యాంపులు ఏర్పాటు చేయాలి.. కరోనా నిబంధనలు పాటిస్తూ.. కార్మికుల భద్రత కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ బిల్డర్లు, డెవలపర్లు పనులు చేయించుకోవాలని సూచించింది.
గ్రేటర్ పరిధిలో భారీ ఎత్తున నిర్మాణ రంగం పనులు, పలు ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. లాక్డౌన్ మూలంగా ఒక్కసారిగా అవి ఆగిపోతే.. అటు కార్మికులకు ఉపాధి లేకుండా పోవడంతో పాటు ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. గత లాక్డౌన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వలస కార్మికులకు ఇబ్బందులు లేకుండా.. ఉపాధి దెబ్బతినకుండా నిర్మాణ రంగంలో పనులు చేసుకునేలా వెసులుబాటును ఇప్పుడు ప్రభుత్వం కల్పించింది. ఇదే విషయమై రాత్రి మూడు పోలీస్ కమిషనరేట్ల అధికారులు నగరంలోని రియల్ ఎస్టేట్ సంఘాల నాయకులతో టెలీ కాన్ఫరెన్స్లో ప్రత్యేకంగా సమావేశమై .. నిర్మాణ రంగానికి సంబంధించి పలు సూచనలు చేశారు.
రెండు తెలుగు రాష్ర్టాలకు చెందిన వారితోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన సుమారు 10 నుంచి 12 లక్షల మంది కార్మికులు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని ఒక అంచనా. గతేడాది లాక్డౌన్లో వారంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం విధించిన లాక్డౌన్తో అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం లాక్డౌన్పై జారీ చేసిన జీవోలో నిర్మాణ రంగం, ప్రాజెక్టుల్లో పనులు చేసేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో లక్షలాది మంది కార్మికులు స్వస్థలాల వెళ్లాల్సిన అవసరం రాకుండా, ఖాళీగా ఉండకుండా ఉపాధి పొందేలా అవకాశమిచ్చింది. అయితే.. కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని బిల్డర్లు, డెవలపర్లకు సూచించింది. అదే సమయంలో పోలీసులు వీటిని ప్రత్యేకంగా పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేసినట్లు క్రెడాయ్ జాతీయ ఉపాధ్యక్షుడు రామిరెడ్డి తెలిపారు.