తెలుగు యూనివర్సిటీ, మే 7: తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో తేజ సాహిత్య సేవా సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రెండు రోజుల పాటు జూమ్ యాప్ వేదికగా జాతీయ తెలుగు కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తేజ సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పోరెడ్డి రంగయ్య శుక్రవారం తెలిపారు. మే 8, 9వ తేదీలలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అంతర్జాలం వేదికగా ఈ కవి సమ్మేళనం కొనసాగుతుందన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరిక్రిష్ణ అధ్యక్షతన జరిగే ప్రారంభ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని అన్నారు. డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, దేశపతి శ్రీనివాస్, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య తదితర సాహితీవేత్తలు పాల్గొంటారని తెలిపారు. సుమారు 300 మంది ఉభయ తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ట్రాలలో స్థిరపడిన తెలుగు కవులు, కవయిత్రులు పాల్గొని కవితా గానం చేస్తారని అన్నారు. ప్రతి ఒక్కరికి ప్రశంసాపత్రాలు అందజేస్తామని తెలిపారు. కవితలను ఒక సంకలనంగా తీసుకువస్తామని రంగయ్య వెల్లడించారు.