దేవరయాంజాల్ సీతారామస్వామి ఆలయభూముల్లో ఈటల జమున గోదాం ఇది. దేవుడి మాన్యంలో అక్రమాలపై అధికారులు చేస్తున్న విచారణలో అనేక అంశాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకూ దాదాపు 160 అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు. ఇక ఖాళీ స్థలాలను కూడా సర్వే చేయనున్నారు.
మేడ్చల్, మే 5 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్లోని దేవాదాయ భూములపై కొనసాగుతున్న విచారణలో మరిన్ని అక్రమ నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్పై వచ్చిన ఆరోపణల మేరకు ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ల ప్రత్యేక కమిటీ మూడోరోజైన బుధవారం విచారణ కొనసాగించింది. 4 బృందాలుగా ఏర్పడి, దేవరయాంజాల్లోని శ్రీసీతారామస్వామి దేవాలయ భూములను వేర్వేరుగా పరిశీలించింది. మంగళవారం 117 అక్రమ నిర్మాణాలను గుర్తించిన ప్రత్యేక కమిటీ బుధవారం మరో 43 అక్రమ నిర్మాణాలను (గోదాములు, గెస్ట్హౌస్లు) గుర్తించింది. దీంతో మొత్తం అక్రమ కట్టడాల సంఖ్య 160కి పెరిగింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి రఘునందన్రావు నేతృత్వంలో ఐఏఎస్ అధికారులు మేడ్చల్-మల్కాజిగిరి ఇంచార్జి కలెక్టర్ శ్వేతా మొహంతి, నల్లగొండ జిల్లా కలెక్టర్ జీవన్పాటిల్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి విచారణను వేగవంతం చేశారు. దేవాదాయ భూముల్లో ఖాళీ స్థలాలను కూడా ప్రత్యేక కమిటీ పరిశీలించింది. పలుచోట్ల ఖాళీ స్థలాల్లో ఆక్రమణదారులు ఫెన్సింగ్ వేసి, చేపట్టిన నిర్మాణాలపైనా ఆరాతీశారు. ఖాళీ స్థలాలపై నివేదిక తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమ నిర్మాణాలపై డీజీసీఎస్ సర్వేను 90% పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన పదిశాతం కూడా త్వరగా పూర్తిచేసి, అనంతరం దేవాదాయ భూముల్లోని ఖాళీ స్థలాల సర్వేకు చర్యలు తీసుకుంటున్నామని కమిటీకి నేతృ త్వం వహిస్తున్న రఘునందన్రావు తెలిపారు.
రైతుల భూమి పత్రాల పరిశీలన
ప్రత్యేక విచారణ కమిటీ ఆదేశాల మేరకు దేవరయాంజాల్లోని రైతుల భూమి పత్రాలను వివిధ మండలాల తాసిల్దార్లు పరిశీలించారు. దేవరయాంజాల్లోని కొన్ని సర్వే నంబర్లకు సంబంధించిన పత్రాలను రైతుల వద్దనుంచి తీసుకున్నారు. పత్రాలను రెవెన్యూ మ్యాప్ల ఆధారంగా పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేవరయాంజాల్లో గతంలో విధులు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శులను తూంకుంట మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ, విజిలెన్స్ అధికారులు విచారించారు. మొత్తం ఐదుగురు కార్యదర్శులకు నోటీసులు జారీచేయగా ప్రస్తుతం ఈవోఆర్డీలుగా ఉన్న రవి, మౌలానా విచారణకు హాజరయ్యారు. దేవాదాయ భూముల్లో అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఏమైనా జారీచేశారా? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే విషయాలపై విచారణ జరిగింది. మరో ముగ్గురిని త్వరలోనే విచారించనున్నారు.
ఫెన్సింగ్లపైనా ఆరా
దేవాదాయ భూముల్లో ఆక్రమణదారులు ఫెన్సింగ్ వేసిన భూముల సర్వే నంబర్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. వాటి ఆధారంగా సర్వే చేస్తే ఆక్రమణదారుల వివరాలు తెలిసిపోనున్నాయి. ఖాళీ స్థలాల్లోని బండరాళ్లను తొలగిస్తూ వాటిని కబ్జా చేస్తున్నారా అన్న విషయాన్ని సర్వే అధికారులు తేల్చనున్నారు. ఈ క్రమంలోనే ఫెన్సింగ్ వేసిన వారి వివరాలను సేకరిస్తున్నారు.