మెదక్, మే 4 : కరోనా వ్యాక్సిన్ ప్రక్రియలో రాష్ట్ర ప్రభు త్వం కీలక మార్పులను తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి స్వస్తి పలికి ముందస్తు స్లాట్ బుకింగ్ చేసుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. టీకా తీసుకునే సమయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ జనం రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఇక నుంచి ముందుగా పేరు నమోదు చేసుకున్న వారికి మాత్రమే టీకా వేయనున్నారు. ఈ నిబంధనలు మంగళవారం నుంచే అమలులోకి వచ్చినట్టు వైద్యాధికారులు చెబుతున్నారు.
మెదక్ జిల్లాలో 24 సెంటర్లలో టీకాలు..
మెదక్ జిల్లాలో 24 సెంటర్లలో 45 ఏండ్లకు పైబడిన వారికి మాత్రమే టీకాలు వేస్తున్నారు. ఇప్పటి వరకు వ్యా క్సిన్ కేంద్రాలకు వచ్చిన వారికి వైద్యులు టీకా వేశారు. ఇక నుంచి 45 ఏండ్లు పైబడిన వారు కేంద్రాలకు రాగానే వారి పేరు, వయస్సు, ఆధార్ నంబర్ ఆన్లైన్లో నమోదు చేసి టీకాలు వేశారు. నేరుగా కేంద్రాలకు వచ్చే వారికి వ్యాక్సిన్ ఇవ్వరు. వ్యాక్సిన్ వేసుకోవాలంటే ముందుగానే కొవిన్ యాప్లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఏ సెంట ర్, ఏ సమయంలో టీకా తీసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా నమోదు చేయాలి. ఆ సమయంలోనే సంబంధిత సెంటర్కు వెళ్లి టీకా తీసుకోవాల్సి ఉంటుంది. రెండో డోసు తీసుకునే వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
జిల్లాలో ఇప్పటివరకు లక్షా 6 వేల మంది టీకా..
మెదక్ జిల్లాలో ఇప్పటివరకు లక్షా 6 వేల మందికి టీకా వేశారు. సెకండ్ వేవ్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కరోనా టీకాకు డిమాండ్ పెరిగింది. దీంతో జిల్లా లో ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు ప్రజల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం.. వ్యాక్సిన్ సెంటర్లలోనే స్లాట్ రిజిస్ట్రేషన్కు శ్రీకారం చుట్టింది. మెదక్ జిల్లా దవాఖాన, నర్సాపూర్ ఏరియా దవాఖాన, తూప్రాన్ సీహెచ్సీ సెంటర్, రామాయంపేట సీహెచ్సీ సెంటర్, మెదక్ అర్బన్ పీహెచ్సీ, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్, పాపన్నపేట, రెడ్డిపల్లి, డి.ధర్మారం, సర్ధనతోపాటు పీహెచ్సీల్లో రోజు వారీగా టీకాలు వేస్తున్నారు. మొదటి డోస్ టీకా వేసుకుని రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్న వారు మా త్రం ఒక రోజు ముందుగానే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. జిల్లాలో 6 వేల కోవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్నాయి.
ఆరోగ్య సేతు, కోవిన్ పోర్టల్లో…
45 ఏండ్లు పైబడిన వారు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలంటే ఇక నుంచి స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే టీకా వేస్తారు. కోవిన్ పోర్టల్ లేదా స్మార్ట్ ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో ఏ సెంటర్లో టీకా వేసుకునే విషయం క్లుప్తంగా వివరించాలి. అయితే ఒక్క సెల్ఫోన్ నంబర్లో ఐదుగురు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. తేదీల వారీగా అవకాశం వచ్చిన రోజు ఆయా దవాఖానలకు వెళ్లి టీకా వేసుకోవాలి. ఆ రోజు వ్యాక్సిన్ కొరత ఉంటే ఆందోళన చెందాల్సిన పని లేదు. మరుసటి రోజు అదే స్లాట్ బుకింగ్తో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.