హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): మంత్రి ఈటల రాజేందర్ కుటుంబం కబ్జాలో ఉన్న అసైన్డ్ భూముల స్వాధీనానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. తమ భూములను మంత్రి ఈటల స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ భూమి యజమానులు చేసిన ఫిర్యాదుపై స్పందించిన సీఎం కేసీఆర్.. విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. విచారణ చేపట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ నేతృత్వంలోని బృందం మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో మంత్రి భార్య జమున పేరున ఉన్న హ్యాచరీస్ ఆధీనంలో 66 ఎకరాల ఒక గుంట అసైన్డ్ భూమి ఉన్నట్టు నిర్ధారించింది. ఈ మేరకు కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు నివేదిక సమర్పించారు.
అసైన్డ్ భూముల క్రయవిక్రయాల గురించి తెలిసిన అధికారులు ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్ (ప్రొహిబిషన్ ఆఫ్ ల్యాండ్స్) 1077 (పీవోటీ) చట్టం ప్రకారం ఈటల ఆధీనంలో ఉన్న భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అధికార యంత్రాంగం కార్యచరణ సిద్ధంచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ చట్టం కింద భూమి ఆక్రమణదారులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఈ చట్టానికి చేసిన ఒక సవరణ ప్రకారం, ఎవరైనా తెలిసో తెలియకో అసైన్డ్ భూమిని కొనుగోలు చేసినవారు కానీ, ఆక్రమించుకున్న వారు కానీ 90 రోజుల్లోగా ప్రభుత్వానికి స్వాధీనంచేస్తే ఎలాంటి శిక్ష ఉండదు. జమున హ్యాచరీస్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న అసైన్డ్ భూములపై పీవోటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. ముందుగా అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఆ తరువాత ఆ భూములు రిస్టోర్ చేయాలా? రీ అసైన్ చేయాలా? తన ఆధీనంలో ఉంచాలా అన్న విషయాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు.