చౌటకూర్, మే 2 : ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అధికారులకు సూచించారు. ఆదివారం మండల కేంద్రమైన చౌటకూర్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలన్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చిన తర్వాత రైతులను ఎవరైనా ఇబ్బందులు పెడితే నేరుగా తనకు సమాచారం అందించాలన్నారు. రైతులకు ఇబ్బందులు తలపెట్టిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, సర్పంచ్ వీరమణి మొగులయ్య, టీఆర్ఎస్ ఉమ్మడి మండల అధ్యక్షుడు శివకుమార్, నాయకులు జాఫర్, దేవయ్య తదితరులు ఉన్నారు.