కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక టీఎంసీ ఏకంగా 204 స్ధానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుండగా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. బెంగాల్లో దీదీ సర్కార్ హ్యాట్రిక్ ఖాయమని ఫలితాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో కోల్కతాలోని కాళీఘాట్ లో టీఎంసీ మద్దతుదారులు, కార్యకర్తలు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.
ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని పార్టీ జెండాలు చేతపట్టి ఉత్సాహంతో నృత్యాలు చేశారు. మరోవైపు నందిగ్రాంలో మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్ధి సువేంధు అధికారిపై ఆధిక్యంలోకి రావడం కూడా కార్యకర్తల్లో జోష్ నింపింది. ఇక బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన హోరాహోరీ పోరులో టీఎంసీ 204 స్ధానాల్లో ముందంజలో ఉండగా, బీజేపీ 83 స్ధానాల్లో, లెఫ్ట్ అభ్యర్ధులు రెండు స్ధానాల్లో, ఇతరులు మూడు స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.