న్యూఢిల్లీ : భారీ భూకంపం సంభవించిన అసోం రాష్ర్టానికి అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భూకంపం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను తెలుసుకునేందుకు అసోం సీఎం సర్బానంద సోనోవాల్తో మాట్లాడినట్లు మోదీ ట్వీట్ చేశారు. కేంద్రం నుంచి అసోంకు వీలైనంత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అసోం ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ తెలిపారు.
అసోం రాష్ర్టంలో సంభవించిన భూకంప పరిస్థితులను అంచనా వేయడానికి ఆ రాష్ర్ట సీఎం సర్బానంద సోనోవాల్తో మాట్లాడినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. అసోం ప్రజల భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అసోంలోని తమ అక్కాచెల్లెల్లు, అన్నాదమ్ముళ్లకు కేంద్రం అండగా ఉంటుందని అమిత్ షా స్పష్టం చేశారు.
అసోంలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత మరో రెండు సార్లు భూమి కంపించింది. ఉదయం 7.51 గంటల ప్రాంతంలో సోనిత్పూర్లో రిక్టర్ స్కేల్పై 6.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఆ తర్వాత 8.13 గంటలకు.. 08.34 గంటలకు మూడోసారి ప్రకంపనలు వచ్చాయి. అయితే భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. వరుసగా మూడుసార్లు ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురై, ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. మొదట రిక్టర్ స్కేల్పై 6.4 తీవ్రతతో వచ్చిన భూకంపంతో ఉత్తర బెంగాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి.