తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్కు దళితుల సంక్షేమంపై విస్తృతమైన ఆలోచన ఉంది. అందులో భాగమే వెయ్యి కోట్ల సీఎం దళిత ఎంపవర్మెంట్ స్కీం. ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలు కాకుండా ఇది ఇంకా ఆశలు రేకెత్తించింది. 70 ఏండ్ల స్వతంత్ర భారతంలో వీళ్లు ఇంకా వెనుకబడి ఉండటానికి కారణాన్నీ లోతుగా అధ్యయనం చేసిన ఆయన దానికి విరుగుడుగా ఈ వెయ్యి కోట్ల స్కీం ప్రవేశపెట్టారు.
ఉద్యమ సమయంలో ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇవ్వాలని ఆయన కోరుకున్నాడు, అది ఆచరణలో ఉంది. రాష్ట్ర అవతరణ తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళిత సంక్షేమ పథకాలలో నూతన అధ్యాయం మొదలైంది. 2004 నుంచి 2014 దాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు రుణాలు పంపిణీ చేసింది. యూనిట్ విలువ 6 లక్షలు ఉండింది. 2014 తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం దానిని 10 లక్షలు చేసి 80 శాతం సబ్సిడీ ఇచ్చింది. ఇప్పుడు 2021-2022 ఆర్థిక సంవత్సరంలో యూనిట్ ధర విలువ 19 లక్షల దాకా పెంచింది. ఇలా ఎస్సీ సంక్షేమంలో నూతన ఒరవడిని తీసుకొచ్చింది.
అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్, ఎస్సీ, ఎస్టీ స్టార్టప్, 100 ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్, దళిత విమెన్ డిగ్రీ కాలేజెస్, ప్రతి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టడీ సెంటర్ ప్రారంభించారు. అయితే ఇంకా వీరి సమగ్ర అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు కావాలని కోరుకుంటున్నారు. అవి రిజర్వేషన్లు, భూమి, రుణాలు, ఇండ్ల రూపేణా ఉంటే బాగుంటుందని వీరి భావన. 2014 సమగ్ర కుటుంబ సర్వేలో ఎస్సీ జనాభా 17.4 శాతం అని తేలింది. కాబట్టి జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, అది 2021 జనాభా లెక్కల ప్రకారం ఇవ్వాలని దళితులు కోరుతున్నారు. ప్రభుత్వమే ప్రాజెక్టులు కట్టి నీటి సౌకర్యం ఇవ్వడంతో ఎక్కడా రైతులు భూములను అమ్మడం లేదు. పైగా తెలంగాణలో భూమి రేట్లు పెరిగాయి. దీంతో దళితులకు మూడెకరాల భూమి పంపకం ఆటంకాలను ఎదుర్కొంటున్నది. యాదవులకు గొర్రెలు, ముదిరాజులకు చేయూతనిచ్చినట్టుగా తమకు ఒక పథకం రావాలని దళితులు ఆశ పడుతున్నారు. పోషకాహారం లోపం వల్ల దళిత పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అందుకు వారు ప్రతి దళిత కుటుంబానికి రెండు ఆవులు ఇవ్వాలని కోరుతున్నారు.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలు యూనిట్ ధర చాలా తక్కువగా ఉందని, దాన్ని 30 లక్షలకు పెంచి బ్యాంకు గ్యారంటీ లేకుండా అర్హత ఉన్న ప్రతి దళిత యువకునికి ఇవ్వాలని యువత కోరుకుంటున్నది. ఈ వెయ్యి కోట్ల పథకంలో ఇండ్లు లేని ప్రతి దళితునికి ప్రభుత్వమే 200 గజాల భూమి ఇచ్చి పక్కాగా గృహ నిర్మాణాలు చేయాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికీ రహదారి, నీరు సౌకర్యం లేని దళిత బస్తీలు, గ్రామాలు ఎన్నో ఉన్నాయి. 500పైగా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా చేసినట్లుగా, దళిత వాడలను గ్రామ పంచాయతీలుగా చేయాలని దళితులు ఆశిస్తున్నారు. వెయ్యి కోట్ల పథకానికి విధి విధానాలు ఇంకా ఖరారు కావాల్సి ఉన్నది. దళితుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఈ వెయ్యి కోట్లలో కొంత మేర కేటాయిస్తే దళితుల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ పునాది వేసినట్లవుతుంది. దళిత వర్గాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది.
పిడమర్తి రవి
వ్యాసకర్త: ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్