హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శనివారం తెలంగాణ హైకోర్టులో పలువురు న్యాయవాదులు స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి మాట్లాడుతూ.. ఎదిగినకొద్ది ఒదిగిన వ్యక్తి జస్టిస్ రమణ అని, అంకితభావం, నిబద్ధతలతో ఆయన ఉన్నత శిఖరానికి చేరారని కొనియాడారు. కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్గౌడ్, బార్ కౌన్సిల్ మెంబర్ చలకాని వెంకట్ యాదవ్, హైకోర్టు న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షుడు పొన్నం అశోక్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.