కరోనా రెండోదశ వేగంగా వ్యాపిస్తున్నదని, ఎలాంటి లక్షణాలు లేకుండా వైరస్ బారిన పడుతున్నారని ఎర్రగడ్డ ఛాతి (చెస్ట్) ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ఖాన్ అన్నారు. శరీరంలో ఏ మాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకొని ఇంట్లో ఉండడం శ్రేయస్కరమని సూచించారు. రాబోయే మూడువారాలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా సోకినా ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో ఉండడం మేలని, అనవసరంగా ఆస్పత్రులకు వస్తుండడంతో పడకల (బెడ్స్) కొరత ఏర్పడుతున్నదని, ఆక్సిజన్ అవసరం ఉన్న వాళ్లే ఆస్పత్రి రావాలని సూచించారు. ఛాతి ఆస్పత్రికి ఎక్కువగా మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల కేసులే ఎక్కువగా వస్తున్నాయని, 124 బెడ్స్ ద్వారా సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని, స్వీయ నియంత్రణతోనే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలమన్నారు. బుధవారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
లక్షణాలున్న వారిలో కొందరికి ఆర్ఏటీ, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్గా ఫలితాలు వచ్చినప్పటికీ జ్వరం తగ్గకపోవడం, ఒళ్లు నొప్పులు ఉండడం, నీరసంగా ఉన్నట్లు అనిపిస్తే సిటీస్కాన్ చేయించుకోవాలి. అప్పుడు కరోనా అని తేలితే వైద్య నిపుణుల సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి. కొంత నయమైందని చికిత్స మానేసినా ప్రమాదమే.