మాచారెడ్డి, ఏప్రిల్ 19 : కామారెడ్డి జిల్లాకు పక్కనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఎగువ మానేరు ఎండాకాలం వచ్చిందంటే చాలు నీటి జాడలేక నెర్రెలుబారి కనిపించేది. కానీ, ఇప్పుడు కాళేశ్వరం జలాలతో నిండుకుండను తలపిస్తున్నది. పూర్తిస్థాయి నీటిమట్టంతో జలకళను సంతరించుకున్నది. నేడు మత్తడి దుంకే అవకాశం ఉంది. నర్మాల వద్ద ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో పంటలు బాగా పండుతాయని అటు రైతులు, తమ ఉపాధికి ఇక ఢోకా లేదని ఇటు మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొండపోచమ్మ సాగర్ నీటివిడుదలతో జలకళ..
నిన్నటి దాకా.. వర్షాలు కురిసినా ఎగువ మానేరు ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ప్రధాన వాగులైన కూడవెల్లి, పాల్వంచ నిండుగా ప్రవహించినా ప్రాజెక్టులో నీటి నిల్వల పరిస్థితి అంతంత మాత్రమే.. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. కాళేశ్వరం జలాలతో ప్రాజెక్టు ఇప్పుడు నిండు కుండలా మారింది. కొండపోచమ్మ సాగర్ నుంచి విడుదల చేసిన గోదావరి జలాలు కూడవెల్లి వాగుద్వారా ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. ఎగువ మానేరు నీటి నిల్వ సా మర్థ్యం 2 టీఎంసీలు (31 అడుగులు) కాగా, ప్రస్తుతం మండు వేసవిలోనూ పూర్తిస్థాయి మట్టం తో కనిపిస్తున్నది. ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువల ద్వారా 15 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నది.
మూడు మండలాల మత్స్యకారులకు ఉపాధి..
పక్క జిల్లాలోని ఎగువ మానేరు ప్రాజెక్ట్ నిండితే మత్స్యకారులకు ఎంతో ఉపాధి లభిస్తుంది. ప్రాజెక్ట్ చుట్టూ పది కిలోమీటర్ల మేర ఉన్న గ్రామాలకు చెందిన మత్స్యకారులు అందులో చేపలు పట్టడానికి అర్హులు. మాచారెడ్డి మండలంలోని లచ్చాపేట, ఘన్పూర్(ఎం), గజ్యానాయక్ తండా, మాచారెడ్డి, చుక్కాపూర్, లక్ష్మీరావులపల్లి, పాల్వంచ, బండరామేశ్వర్పల్లి, ఫరీద్పేట, దోమకొండ, బీబీపేట మండలంలోని అంబారీపేట, తుజాల్పూర్, కోనాపూర్, జనగామ తదితర గ్రామాలకు చెందిన మత్స్యకార్మికులు మానేరు ప్రాజెక్టులో చేపలు పడతారు. ఇప్పటికే ప్రాజెక్టులో ఐదు లక్షల చేపపిల్లలను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ద్వారా మత్స్యకార్మికులకు జీవనోపాధి లభిస్తుంది.
పెరిగిన భూగర్భజలాలు..
ఎగురవ మానేరు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉన్నది. ఏటా బోరుబావులు ఎత్తిపోయే పరిస్థితి ఉండేదని, ఇప్పడు ప్రాజెక్టులో నిండుగా నీరు ఉండడంతో ఇక నీటికి కరువే ఉండదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
డ్యాంలో నీళ్లుంటే ఎంతో ఉపాధి
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్ట్లో నీళ్లు ఉంటే మాకు ఎంతో ఉపాధి లభిస్తుంది. ఎండాకాలంలో దాదాపుగా నీళ్లు కనిపించవు, కానీ ఇప్పుడు ప్రాజెక్ట్లోకి పూర్తి స్థాయిలో నీళ్లు రావడం సంతోషంగా ఉంది.
-ఎర్రోల్ల రమేశ్, అధ్యక్షుడుమత్స్యకార్మిక సొసైటీ, మాచారెడ్డి
చేపల వేటకు ఢోకా లేదు..
మానేరు డ్యామ్ పూర్తిగా నిండింది. ఇక నుంచి ఎప్పుడూ నీళ్లుంటాయి. ప్రాజెక్టులో మత్స్య సంపదకు ఇక ఢోకా ఉండదు. మా గ్రామం శివారు నుంచే కూడవెల్లి వాగు ప్రవహిస్తది. వాగు ద్వారా డ్యామ్లో చేపలు పడుతాం. ఎండకాలంలో ప్రాజెక్టులో ఇన్ని నీళ్లు ఉండడం గతంలో ఎన్నడూ చూడలేదు.
-కామారపు మహేశ్, మత్స్యకార్మికుడు,
శివారు రాంరెడ్డిపల్లి (బీబీపేట)