పీవీ నరసింహారావు బహుభాషా కోవిదులు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపై ఆయన అభిప్రాయం వేరేగా ఉండేది. ప్రధానిగా పనిచేసి దిగిపోయాక గాంధీభవన్లో నిర్వహించిన ఓ సమావేశంలో పీవీ మాట్లాడుతూ ‘నేను అనేక భాషలు నేర్చకుని తప్పు చేశాను. ఆ సమయాన్ని నేను జ్ఞానాన్ని సముపార్జించేందుకు వినియోగిస్తే బాగుండేది’ అని కొంచెం నిరాశ చెందారు. అయితే ఆయన అలా ఎందుకన్నారు? అని తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఒక పాత్రికేయుడు నేరుగా వెళ్లి పీవీనే అడిగారు. దానికి పీవీ చెప్పిన సమాధానమేమంటే.. ‘ఎవరూ అందుకోలేనంత వేగంగా సాంకేతిక విజ్ఞానం విస్తరిస్తున్నది. అభివృద్ధి చెందుతున్నది. దానిని నేను అందుకోలేకపోతున్నా. ఈ భాషలను నేర్చుకునేందుకు వెచ్చించిన సమయాన్ని సాంకేతిక విజ్ఞానం నేర్చుకునేందుకు పెడితే ఎంతో జ్ఞానం నేర్చుకునేవాడిని అనిపిస్తుంద’ని సమాధానం ఇవ్వడంతో ఆ పాత్రికేయుడు నోరెళ్లబెట్టాడు. అందుకు కారణం లేకపోలేదు. కంప్యూటర్ అంటే దేశంలో చాలామందికి తెలియని రోజుల్లోనే, అందులోనూ 80 ఏండ్ల వయస్సులో దానిని నేర్చుకున్న పీవీనే అలా అనడంతో ఆశ్చర్యపోయారు.