తిరువనంతపురం : కేరళ సీఎం పినరయి విజయన్.. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు విమర్శలు వస్తున్నాయి. కోవిడ్ రిపోర్ట్ నెగటివ్ రావడంతో.. బుధవారం రోజున ఆయన కోజికోడ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత.. అంటే ఏప్రిల్ 8వ తేదీన సీఎం విజయన్ కరోనా పరీక్షలో పాజిటివ్గా తేలారు. అయితే రూల్ ప్రకారం .. పాజిటివ్ వచ్చిన వారికి మళ్లీ పది రోజుల తర్వాత పరీక్ష చేసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయాలి. కానీ బుధవారం రోజున ఆయనతో పాటు ఆయన భార్య కూడా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. కోజికోడ్ కాలేజీ డాక్టర్ చెప్పిన విషయాలు వివాదానికి దారి తీశాయి.
సీఎం విజయన్ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించలేదని, ఎందుకంటే ఆయనకు ఏప్రిల్ 4వ తేదీన పాజిటివ్గా వచ్చినట్లు ఆ డాక్టర్ తెలిపారు. వాస్తవానికి ఆ రోజున ప్రచారానికి చివరి రోజు కావడంతో సీఎం విజయన్ .. ధర్మదం నియోజకవర్గంలో ర్యాలీలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఏప్రిల్ ఆరవ తేదీన పోలింగ్ బూత్కు వచ్చి ఓటేశారు. మీడియాతోనూ మాట్లాడారు. విమర్శలు వస్తున్న నేపథ్యంలో చివరగా కాలేజీ డాక్టర్ మరో వివరణ ఇచ్చారు. ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి విజయన్లో కోవిడ్ లక్షణాలు కనిపించాయని, ఏప్రిల్ 8న నిర్వహించిన పరీక్షలో పాజిటివ్గా తేలారని, అంటే బుధవారానికి 10 రోజుల గడువు ముగిసిందని డాక్టర్ తెలిపారు. పరీక్షలో నెగటివ్ రావడంతోనే సీఎంను ఇంటికి పంపినట్లు చెప్పారు. సీఎం విజయన్ వారం రోజుల పాటు హోం క్వారెంటైన్లో ఉండనున్నారు. మే 2వ తేదీన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడనున్నాయి.