దేవాలయ భూమిని కౌలుకు తీసుకుని కూరగాయల సాగు
ఎండకాలంలో మెళకువలు పాటించి మంచి దిగుబడి
నిరుద్యోగం భారం కాకూడదని ఉన్నదాంట్లో భూమిని నమ్ముకుని వ్యవసాయంపై ఆసక్తి కనబరిచాడు. దేవాలయ భూమిని వేలం పాటలో కైవసం చేసుకుని, ఎవుసం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ కౌలురైతు. కౌలుకు తీసుకున్న పంట పొలాన్ని మండుటెండలో బిందుసేద్యంతో కూరగాయల పంటలను సాగు చేస్తూ మంచిదిగుబడి సాధిస్తున్నాడు. వంకాయ, టమాట పంటలను సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు..
గుమ్మడిదల, ఏప్రిల్ 14: మండల పరిధిలోని బొంతపల్లి-వీరన్నగూడెం గ్రామంలోని సుప్రసిద్ధశైవక్షేత్రమైన భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి చెందిన దేవాలయభూమిని కౌలుకోసం గత ఏడాది ఆలయ కమిటీ నిర్వహించిన వేలంపాటలో వీరన్నగూడెం గ్రామానికి చెందిన పొన్నబోయిన రామచందర్ కౌలుకు తీసుకున్నాడు. కాగా, బొంతపల్లికి చెందిన భూస్వామి గిద్దెరాజు దేవాలయానికి చెందిన 25 ఎకరాల భూమిని వినియోగంలోకి తీసుకురావడానికి ఫెన్సింగ్, బోర్లు వేయించారు. దీంతో దేవాలయభూమికి ప్రతి ఏడాది ఆదాయం వచ్చేవిధంగా దోహదపడింది. వీరన్నగూడెం చెందిన రామచందర్ కౌలుకు తీసుకుని ఆ పొలంలో వంకాయ, టమాట పంటను సాగు చేశాడు. వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారుల సలహాలతో కూరగాయల పంటలకు నీరందించడానికి డ్రిప్ సిస్టమ్ ద్వారా బిందు సేద్యం ద్వారా నీరందిస్తున్నాడు. మండుటెండలో కూడా కూరగాయలు పండించడంతో మంచి దిగుబడి వస్తుంది. పండిన వంకాయలను మార్కెట్కు తరలించి లాభాలు పొందుతున్నాడు.
కౌలుకు తీసుకుని కూరగాయలను సాగు చేస్తున్న..
ఆలయభూమిని కౌలుకు తీసుకుని వంకాయ, టమాట పంటలను బిందు సేద్యం ద్వారా సాగు చేస్తున్న. వంకాయ బాగా దిగుబడి వస్తున్నది. కరోనా వైరస్ విజృంభిస్తుండడం, శుభదినాలు లేకపోవడం వల్ల వంకాయకు డిమాండ్ లేదు. పండుగల సీజన్, పెండ్లి రోజులు వస్తే మంచి గిరాకీ ఉంటది. ఇప్పుడు చేతికి వస్తున్న పంటను మార్కెట్లో విక్రయిస్తున్నాం. నాణ్యమైన వంకాయ పంటకాస్తుండడంతో చిరు వ్యాపారులు కొనుగోలు చేసుకుంటున్నారు. ఎవరైనా ఆర్డర్ ఇస్తే కూడా వారికి సమయంలో అందిస్తున్నాం. టమాట పంట కూడా మంచి దిగుబడి వస్తున్నది. మిగిలిన పొలంలో సోర, బుడుమ కాయలు వంటి పంటను సాగు చేస్తున్న. వానకాలంలో పత్తి పంటను వేశా. తర్వాత బెండ పంటసాగు చేశాను. మంచి దిగుబడి వచ్చింది.