సత్వర న్యాయం అందించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న లోక్ అదాలత్ కేసుల సత్వర పరిష్కారానికి వేదికగా మారుతున్నది. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ హైకోర్టు ఆదేశం మేరకు హైదరాబాద్ మెట్రో పాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన జాతీయ లోక్ అదాలత్లో ఒకేరోజు 1641 కేసులు పరిష్కారం కావడమే ఇందుకు నిదర్శనం. కంపౌండబుల్ క్రిమినల్ కేసులు, మోటార్ ఆక్సిడెంట్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, గృహ హింస కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ప్రి లిటిగేషన్ కేసులు ఈ జాతీయ లోక్ అదాలత్లో పరిష్కారమయ్యాయి. కక్షిదారులు కేసును సామరస్యంగా పరిష్కరించుకున్నారు. పరిష్కారమైన 1641 కేసుల్లో కంపౌండబుల్ క్రిమినల్ కేసులు 777, ఎక్సైజ్ కేసులు 273, ఎన్ఎల్ యాక్ట్ కేసులు 558, వివాహ సంబంధ సమస్యల కేసులు 33 ఉన్నాయి.
చట్టం ముందు అందరూ సమానమని ఓ ఉదంతం నిరూపించింది. తండ్రి, కొడుకు బండిపై వెళ్తున్న సమయంలో తండ్రి అతివేగంతో నడపడంతో స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పి ప్రమాదం జరిగింది. గాయపడిన కొడుకును స్థానికులు ఆస్పత్రిలో చేర్చించారు. మొగల్పురా పోలీసులు తండ్రిపై కేసు నమోదు చేశారు. అతడిపై ఐపీసీ 337, 338 పెట్టి చార్జిషీట్ ఫైల్ చేశారు. ఈ కేసుకు సంబంధించి శనివారం లోక్ అదాలత్లో గాయపడ్డ అబ్బాయి తల్లి మధ్యవర్తిగా వ్యవహరించి న్యాయమూర్తి ఎదుట కేసు పరిష్కారం చేసుకున్నారు.
చర్చి అసోసియేషన్ నిర్వహణలో వివాదాలపై 9 కేసులు నమోదయ్యాయి. ఈ వివాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండటం వల్ల వారంతా జాతీయ లోక్ అదాలత్లో న్యాయమూర్తి సమక్షంలో ఫిర్యాదుదారుడితో రాజీ పడటంతో 9 కేసులు పరిష్కారం కావడం గమనార్హం.
ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారం చేపట్టినట్లు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, హైదరాబాద్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ తుకారాంజీ పేర్కొన్నారు. కేసులకు సంబంధించిన పార్టీలు భౌతికంగా, మరికొందరు ఆన్లైన్లో పాల్గొని పరిష్కరించుకున్నట్లు తెలిపారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా కోర్టు ఆవరణలో శానిటైజింగ్ చేయడంతోపాటు వచ్చిన ప్రతి ఒక్కరికీ అవసరమైన మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచామన్నారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ ద్వారా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.