ములుగులో గరిష్ఠంగా 43డిగ్రీలు నమోదు
భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్లో 42 డిగ్రీలు
అర్బన్, రూరల్లో 39.. క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
బయటకు వెళ్లేందుకు జంకుతున్న జనం
మధ్యాహ్న వేళ నిర్మానుష్యంగా రహదారులు
అప్రమత్తతే మేలు అంటున్న వైద్యులు
సూరీడు సెగలు కక్కుతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండగా మంగళవారం ములుగులో అత్యధికంగా 43, కోల్బెల్ట్ ఏరియాలోని భూపాలపల్లిలో 42 డిగ్రీలు నమోదైంది. వారం రోజుల నుంచి ఉమ్మడి వరంగల్లోని అన్ని జిల్లాల్లో క్రమక్రమంగా ఎండ తీవ్రత ఎక్కువై జనం బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. దీంతో మధ్యాహ్నం వేళ ఏ రహదారిని చూసినా నిర్మానుష్యంగా కనిపిస్తోంది. మున్ముందు ఎండలు ముదరనున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
భానుడు భగ్గుమంటున్నాడు. వారం రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 40 డిగ్రీలపైనే నమోదవుతుండగా మంగళవారం ములుగులో అత్యధికంగా 43 డిగ్రీలు, కోల్బెల్ట్ ఏరియా భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో 42 డిగ్రీలుగా నమోదైంది. దీంతో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఓ వైపు కరోనా వైరస్ సోకకుండా మాస్క్లు ధరిస్తూ, మరోవైపు ఎండదెబ్బ తగులకుండా తలపాగా, టోపీలు ధరించి బయటకు వస్తున్నారు. ఉపశమనం కోసం శీతల పానియాలు తాగుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఈ ఏడాది మాత్రం మార్చి చివరి వారంలోనే ఎండలు దంచికొడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఇంకా ముదిరే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీలకు పెరుగవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎండలో బయటకు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రథమ చికిత్స ఇలా..
వడదెబ్బకు గురైన వ్యక్తిని చల్లని నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి.
శరీరాన్ని చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి.
ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, గ్లూకోజ్, ఓఆర్ఎస్ కలిపిన ద్రావణం తాగించాలి
ప్రథమ చికిత్స చేసి వీలైనంత త్వరగా అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి.
సత్వర సేవల కోసం 104, 108కు సమాచారం ఇచ్చి వారి ప్రాణాలు కాపాడాలి.
వడదెబ్బ లక్షణాలు
శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరుగుతుంది.
తీవ్రమైన తలనొప్పి వచ్చి నాడీ వేగంగా కొట్టుకుంటుంది.
నాలుక ఎండిపోవడం, చర్మం ఎండిపోవడం వంటి లక్షణాలతో నీరసించిపోతారు.
శరీరం నీటి శాతం కోల్పోతుంది.
మూత్రం పసుపు రంగులో ఉండి మూత్ర విసర్జన సమయంలో మంట వస్తుంది.
పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మారక స్థితికి చేరుకుంటారు. ఇలాంటి లక్షణాలు ఉంటే వడదెబ్బ తగిలినట్లు గుర్తించి వెంటనే ప్రథమ చికిత్స అందించాలి.
జాగ్రత్తలు పాటిస్తే వడదెబ్బ తగలదు
ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు బయట తిరుగొద్దు. పిల్లలు, వృద్ధులు అనారోగ్యంతో బాధపడేవారు.. ముఖ్యంగా గుండె, కిడ్నీ, షుగర్ వంటి వ్యాధులున్నవారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండాకాలంలో మనిషిలో చెమట రూపంలో నీరంతా బయటకు వెళ్లి నీటి శాతం తగ్గిపోతుంది. ఈ క్రమంలో ఎండకు తిరిగితే వడదెబ్బ తగులుతుంది. రోజు 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలి.
ఎండలో బయట తిరుగొద్దు
వేసవిలో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ. తప్పనిసరైతే ఉదయం 11గంటల లోపు, సాయంత్ర 3 తర్వా త బయటికి వెళ్లాలి. నీళ్లు, కొబ్బరినీరు ఎక్కువగా తాగాలి, కాటన్ దుస్తులు ధరించాలి. చలువ అద్దాలు వినియోగించాలి. పిల్లలను అవుట్ డోర్ గేమ్స్కు పంపొద్దు. టీ, కాఫీలు, నాన్వెజ్ తగ్గించి, మజ్జిగ తాగాలి.