సర్కారు చర్యలతో పూర్వ వైభవం
పెరిగిన అటవీ విస్తీర్ణం
సందడి చేస్తున్న వన్యప్రాణులు
పక్షుల కిలకిల
ఆదిలాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో 1706.89 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉం డగా, జిల్లా భూభాగంలో అడవులు 41.1 శాతం విస్తరించి ఉన్నాయి. ఆదిలాబాద్, మావల, ఇంద్రవెల్లి, ఉట్నూర్, ఇ చ్చోడ, బోథ్, బజార్హత్నూర్, తలమడుగు, తాంసి మండలాల్లో దట్టమైన అడవులు ఉన్నాయి. ఇక్కడి అడవులు వివి ధ రకాల వన్యప్రాణులు, పక్షులకు ఆవాసాలుగా ఉండేవి. గతంలో కలప అక్రమ రవాణా కారణంగా జిల్లాలోని అటవీ ప్రాంతం అంతరించిపోయింది. విలువైన వృక్షసంపదను స్మగ్లర్లు యథేచ్ఛగా నరికివేసి భారీగా సొమ్ము చేసుకున్నారు. అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పట్టించుకోలేదు. స్మగ్లర్ల విషయంలో చూడనట్టుగా వ్యవహరించారు. దీంతో వన్యప్రాణులు, పక్షులు, పిచ్చుకలు అవాసం కరువై ఇతర ప్రాంతాలకు వలసపోయాయి. వేటగాళ్లు పలుచగా మారిన అడవుల్లో అటవీ జంతువులను వేటాడడంతో ప్రా ణాలు వదిలాయి. ఫలితంగా అడవుల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్లో అటవీ సంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది.
ప్రభుత్వం పకడ్బందీ చర్యలు..
తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో అడవుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఆరేళ్లుగా అమలు చేస్తున్న హరితహారంలో భాగంగా అడవులను పునరుద్ధరణకు ఆ శాఖ అధికారులు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారు. మైదానాలుగా మారిన అటవీ ప్రాంతాల్లో బ్లాక్ ప్లాంటేషన్ చేపట్టి లక్షల సంఖ్యలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్షీణించిన అడవుల పునర్జీవం (రెజువనేషన్ ఆఫ్ డీ గ్రేడెడ్ ఫారెస్ట్) కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్, ఉట్నూర్, ఇచ్చోడ ఫారెస్ట్ డివిజన్లో వివిధ పనులు చేపట్టారు. గతంలో ఇచ్చోడ మండలంలోని ముల్తానీలతో పాటు స్మగ్లర్లు కలప స్మగ్లింగ్కు పాల్పడేవారు. అక్రమ కలప నివారణకు అటవీశాఖ, పోలీసు అధికారులు ఉక్కుపాదం మోపారు. టేకు, ఇతర కలపతో ఫర్నిచర్ తయారు చేస్తున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ముగ్గురు అక్రమార్కులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. అటవీ సంరక్షణలో భాగంగా కట్టెలు ఎవరూ తీసుకుపోకుండా చూడడం, పశువులు, మనుషులు అడవుల్లోకి రాకుండా చుట్టూ కందకాలు తవ్వారు. అటవీ సరిహద్దుల్లో గచ్చికాయ చెట్లను పెంచుతున్నారు. నీటి నిల్వలను పెంచేందుకు పర్కులేషన్ ట్యాంకులు నిర్మించారు. అగ్ని ప్రమాదాలు జరుగకుండా 5 ఫీట్లకు ఫైర్ లైన్స్ ఏర్పాటు చేశారు.
పూర్వ వైభవం..
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఆదిలాబాద్ జిల్లా అడవులు పూర్వ వైభవం సంతరించుకున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పలుచగా మారిన అడవుల్లో చెట్లు కనపడుతున్నాయి. వానకాలంలో జిల్లాలోని జాతీయ రహదారిపై ఉన్న అటవీ ప్రాంతాలు వాహనదారులకు కనువిందు చేస్తున్నాయి. గతంలో వలసపోయిన జంతువులు జిల్లా అడవులకు తిరిగివస్తున్నాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర అభయారణ్యం నుంచి పులులు సైతం ఇక్కడి అడవుల్లో సంచరిస్తున్నాయి. పక్షులు సైతం అటవీ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కనపడుతున్నాయి.