‘కరోనా భయాల్ని మరిపిస్తూ మనస్ఫూర్తిగా నవ్విస్తున్న మంచి సినిమాగా ‘జాతిరత్నాలు’ అందరి మన్ననల్ని అందుకుంటోంది’ అని అన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. గురువారం హైదరాబాద్లో జరిగిన ‘జాతిరత్నాలు’ సక్సెస్మీట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ నిర్మాత, అనుదీప్ దర్శకుడు. సక్సెస్మీట్లో దర్శకుడు మాట్లాడుతూ ‘థియేటర్లలో నవ్వుల్ని పూయించేందుకు మేము చేసిన ప్రయత్నం ఫలించింది. కథ బాగా రావడంలో హీరో నవీన్ కృషి చాలా ఉంది’ అని అన్నారు. ‘పెళ్లిచూపులు’ తర్వాత అంతలా మళ్లీ ప్రేక్షకుల్ని నవ్విస్తున్న చిత్రమిదని ప్రియదర్శి పేర్కొన్నారు. నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ ‘చాలా రోజుల తర్వాత కడుపుబ్బా నవ్విస్తున్న మంచి సినిమా ఇదని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అంతకుమించిన అవార్డు ఏదీ లేదు. నా కెరీర్లో జోగిపేట శ్రీకాంత్ మంచి పాత్రగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ‘జాతిరత్నాలు’ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నాం’ అని తెలిపారు. .