న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ మహిళలపై జరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ మహిళల కేసులను పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా 190 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. రాజ్యసభలో ఇవాళ మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ మహిళల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఏపీకి చెందిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి .. ఈ అంశంపై ఓ ప్రశ్న వేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశా చట్టాన్ని కేంద్రం ఆమోదిస్తుందా అని ఆయన అడిగారు. 9 రాష్ట్రాల్లో దళిత మహిళలపై దాడులు ఎక్కువవుతున్నాయని, ఆ నేరాలను అదుపు చేసేందుకు కేంద్రం ఎటువంటి చర్యలు చేపట్టిందని కాంగ్రెస్ ఎంపీ జీసీ చంద్రశేకర్ తెలిపారు. అయితే లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర పరిధికి సంబంధించిన అంశమని, ఆ చట్టాల్లో కేంద్రం కొన్ని మార్పులు చేసినట్లు మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.